నేరేడుచర్ల, జూలై 21 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యే సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లకు ఫారాలు పంపిణీ , తిరిగి వా టిని సేకరించడం, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ పూర్తి కావొస్తున్నది. జిల్లా అధికార యంత్రాంగం సర్ ప్రక్రియలో నిమగ్నమైంది. సర్ ప్రక్రియలో పాల్గొనని ఓటర్లు తక్షణమే తమ ఫారాలను బీఎల్వోలకు అందజేయాలి. ఈ పక్రియ చివరి దశకు చేరినందున అర్హులైన ప్రతిఒక్కరూ తమ ఫారాలను అందజేసి డిజటలైజేషన్ చేయించుకోవాలి.
82 శాతం డిజటలైజేషన్ పూర్తి..
జిల్లాలో ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 12 వరకు 82 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారుల తెలిపారు. మొత్తం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 1205 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 10,08,252 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 7,92,385 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజటలైజేషన్ పూర్తి చేశారు. ఇంకా 1,84,149 మందికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ పూర్తి చేయా ల్సి ఉంది. గడవు సమీపిస్తుండటంతో పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ పూర్తి అవుతుందా అనే ప్రశ్నార్థకంగా మారింది.
సమీపిస్తున్న గడువు..
సర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియను ఈనెల 24వ తేదీ వరకు పూర్తి చేయాలని, ఈనెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని తొలుత నిర్ణయించినప్పటికీ ఇంకా చాలా వరకు డిజటలైజేషన్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 10న ఓటరు ముసాయిదా జాబితా, సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, వచ్చిన అభ్యంతరాలను అక్టోబర్ 10లోగా పరిష్కరించి ఓటరు లిస్టు తుది జాబితాను అక్టోబర్ 12న ప్రకటించనున్నారు. గుడువు మరో 13 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈలోగా బీఎల్వోలకు దరఖాస్తులు సమర్పిస్తేనే ఓటుకు భద్రత ఉంటుంది. ప్రక్రియ ముగిసిన అనంతరం ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఫారాలు అందజేయని వారి ఓట్లు ఈ జాబితాలో వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ ఫారాలు సమర్పించని ఓటర్లు తక్షణమే ఫారాలు అంజేయాలని అధికారులు కోరుతున్నారు.
అయోమయంలో ఓటర్లు..
ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇచ్చే గడువు సమీపిస్తుండటంతో చాలా మంది ఓటర్లు అయోమయంలో ఉన్నారు. ఓటరు జాబితా ఫారా లు నింపి ఇచ్చిన వారు ఊపిరి పీల్చుకుంటుండగా ఇంత వరకూ ఫారాలు నింపని వారు ఆందోళనలో ఉన్నారు. మరి కొంత మంది తెలిసిన వారితో పూర్తి వివరాలు నింపి ఇద్దామనుకున్నా ఫారాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.