రామగిరి (నల్లగొండ), మే 20 : కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో వలస కార్మికుల అడ్డా, మార్కెట్ హమాలీల బైక్ ర్యాలీ, సుభాష్ విగ్రహం దగ్గర పలు రంగాల కార్మికులు నల్ల జెండాలు, ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తూ కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు.
ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ, కనీస పెన్షన్ రూ.9 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు కనీస భద్రత కల్పిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ నల్లగొండ పట్టణ నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, కత్తుల యాదయ్య, కొత్తరాజు ప్రభు చారి, యాదగిరిరెడ్డి, చంద్రశేఖర్, వజ్జా పరమేశ్, కొత్త నాగయ్య, ఆంజనేయులు, లింగస్వామి పాల్గొన్నారు.