సూర్యాపేట అర్బన్ జూన్ 22 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల పుస్తకాల దందాను బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం బట్టబయలు చేసింది. సోమవారం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు రాజు గౌడ్ మాట్లాడుతూ పాఠశాల పక్కనే ఉన్న గోదాంలో నిల్వ ఉంచిన రూ.30 లక్షల విలువ చేసే పుస్తకాలను మండల విద్యాధికారి శ్రీనివాస్ సీజ్ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. పుస్తకాలు విక్రయిస్తూ పేద,మధ్య తరగతి వారిని పీడిస్తున్న ఇలాంటి విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నరేష్ గౌడ్, సతీష్ ,మురళి తదితరులు పాల్గొన్నారు.
ఈ విషయమై ఎంఈవో శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇస్తూ విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుతో గోదాంలోని పుస్తకాలను సీజ్ చేశామన్నారు. అనంతరం పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని వివరణ కోరగా తమకు పుస్తకాల వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారన్నారు. ప్రస్తుతం పుస్తకాలను సీజ్ చేశామని, సంబంధిత వ్యక్తులు వచ్చిన అనంతరం వివరణ తీసుకొని, జిల్లా విద్యాశాఖ అధికారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.