రామగిరి, మార్చి 11: పదోతరగతి పబ్లిక్ (వార్షిక) పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు పూర్తిచేశారు. మరోవైపు ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ప్రశ్న ప్రతాలు, పరీక్షల నిర్వహణ తీరు పర్యవేక్షణకు, ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గదిలోతో పాటు ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా నీడలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండటంతో 180 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సిబ్బందిని నియమించారు. విద్యార్థులు విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ట్లతో సైతం పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించగా, మరో వైపు హాల్టికెట్లపై ఈ పర్యాయం ఆయా పరీక్షా కేంద్రాల అడ్రస్సుతో క్యూ ఆర్ కోడ్ ముద్రించారు.
అదే విధంగా పరీక్ష రాసే విద్యార్థులు ఓఎంఆర్, ఆన్సర్బుక్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు విద్యాశాఖ వెబ్సైట్లో నమూనా అందుబాటులో ఉంచారు. అన్ని డీఈవో కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో వైపు విద్యార్థులు తమ హాల్టికెట్లను www.bse.telangana.gov.inలో డౌన్లోడ్ చేసుకుని (ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం లేనప్పటికీ) పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలను నల్లగొండ డీఈవో బొల్లారం భిక్షపతి, సూర్యాపేటలో డీఈవో అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ పర్యవేక్షిస్తారు.
కెమెరాలు, ఫ్లయింగ్ స్కాడ్ నియామకం
పరీక్షల నిర్వహణలో భాగంగా ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 180 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గదితోపాటు పరీక్షా కేంద్రంలో ఆవరణ కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన సమయం నుంచి ముగిసే వరకు రికార్డు చేసిన సీసీ పుటేజీని ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చివరి రోజు సీల్డ్ కవర్లో భద్రపర్చి ఆయా జిల్లాలోని డీఈవోలకు సమర్పించాలి. అలాగే పరీక్షల పర్యవేక్షణకు నల్లగొండ జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరే కాకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్కాడ్ ఉంటారు.
పరీక్షల నిర్వహణకై హెల్ప్ డెస్క్లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణకై ఆయా జిల్లాలోని డీఈవో కార్యాలయంలో 24 గం. పనిచేసేలా హెల్ప్డెస్క్లు(కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంచారు.అన్ని ఏర్పాట్లు చేశాం..పరీక్షల నిర్వహణకు కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలమేరకు సీసీ కెమెరాలతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ చేస్తారు. పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా డీఈవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా ఏర్పాట్లు చేశాం.
-బొల్లారం భిక్షపతి, డీఈవో, నల్లగొండ
విద్యార్థులు పాటించాల్సిన సూచనలు
సిబ్బంది పాటించాల్సిన నిబంభనలు