మునుగోడు, డిసెంబర్ 11 : విద్యుత్ మీటర్ రీడింగ్ నమోదులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధుని సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించనున్నది. ఇప్పటి వరకు రీడింగ్ నమోదుకు వినియోగించే స్పాట్ బిల్లింగ్ యంత్రాల స్థానంలో ఆండ్రాయిడ్ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా మీటర్ రీడింగ్లో తప్పులకు ఆస్కారం ఉండదు.
హెచ్చు తగ్గులకు చెల్లుచీటి
విద్యుత్ మీటర్ రీడింగ్లో ఇకపై హెచ్చు తగ్గులకు అస్కారం ఉండదు. రీడింగ్ తీసిన వెంటనే వినియోగదారులు బిల్లు చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. కొత్త విధానంలో రీడింగ్ ప్రకారం బిల్లుల నమోదు చేయడం వల్ల తప్పులకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 10.52 లక్షల కనెక్షన్లు
ఉమ్మడి జిల్లాలోని ఏడు విద్యుత్ డివిజన్ల పరిధిలో వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించి 10,52,240 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో నల్లగొండ పరిధిలో 2,32,931, మిర్యాలగూడ 1,50,679, దేవరకొండ 90,368, సూర్యాపేట1,39,894, హుజూర్నగర్ 1,75,752, యాదాద్రి 1,66,238, చౌటుప్పల్ 96,440.
ఆండ్రాయిడ్ పరికరాల వినియోగం..
విద్యుత్ రిడింగ్ విషయంలో వస్తున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాన్స్కో అధికారులు ఆండ్రాయిడ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెల్ఫోన్ మాదిరిగా ఉండే పరికరాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్తో అనుసంధానించి బిల్లింగ్ సిబ్బందికి అందిస్తున్నారు. పాత పద్ధతి ప్రకారం ఒక ఉద్యోగి తన పరిధిలోని విద్యుత్ కనెక్షన్లకు మీటరు రీడింగ్ తీసి ఈఆర్వో కార్యాలయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టేది. అప్పటివరకు వినియోగదారుకు ఆన్లైన్లో బిల్లు కనిపించేది కాదు. అలాగే వివరాలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే ఇబ్బందులు వచ్చేవి. అయితే ఆండ్రాయిడ్ యంత్రాలతో మీటర్ రీడింగ్ నమోదు చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. రీడింగ్ నమోదు చేసి బిల్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ను మీటరు వద్దకు తీసుకెళ్లగానే రీడింగ్ నమోదవుతుంది. నమోదైన రీడింగ్ను ప్రింట్ తీయడానికి ప్రత్యేక యంత్రాన్ని సమకూర్చనున్నారు. రీడింగ్ నమోదైన వెంటనే ఆన్లైన్లో బిల్లు వస్తుంది. దాంతో బిల్లు చెల్లించుకునేందుకు జాప్యం ఉండదు.
ఇప్పటివరకు ఇలా….
గృహ, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సంబంధించి మీటర్ల రీడింగ్ గతంలో దస్ర్తాల ఆధారంగా ఉండేది. సిబ్బంది వినియోగదారుడి ఇంటికి వెళ్లి రిజిస్టర్లో రీడింగ్ నమోదు చేసి బిల్లులు జారీ చేసేవారు. దాంతో సేవల్లో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ బిల్లింగ్ యంత్రాలు వచ్చాయి.ప్రస్తుతం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి స్పాట్ బిల్లింగ్ పరికరాల సాయంతో రీడింగ్ నమోదు చేస్తున్నారు. అయితే కాలం చెల్లిన యంత్రాలు తరుచూ మొరాయిస్తున్నాయి. యంత్రం పాడైతే సంబంధిత ఉద్యోగి పరిధిలో కనెక్షన్ల రీడింగ్ నిలిచిపోతోంది. ప్రత్యామ్నాయంగా మరొకరు వచ్చి రీడింగ్ నమోదు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నమోదు కార్యక్రమం ప్రారంభమైనది
ఆండ్రాయిడ్ యంత్రాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రీడింగ్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన యంత్రాలు కావడంతో రీడింగ్లో తప్పులు దొర్లే అవకాశం లేదు. దానికి తోడు వెంటనే బిల్లు చెల్లించే అవకాశం ఉంది. కొత్త విధానంపై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు.
– సీహెచ్ శంకరయ్య, డివిజినల్ ఇంజినీర్, నల్లగొండ