నల్లగొండ : మహిళల భద్రతకు పోలీసుశాఖ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటుందని డీఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీటీమ్ పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళ భద్రత కోసం పోలీసుశాఖ ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరింత సమర్ధవంతంగా పని చేస్తున్నదని చెప్పారు. మహిళలు ఫిర్యాదు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్యూ ఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు.
వేధింపులకు, భౌతిక దాడులు, ఈవ్ టీజింగ్, బెదిరింపులపై క్యూఆర్ కోడ్ ద్వారా బాధితులు నేరుగా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. షీటీమ్ పోలీస్ స్టేషన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న వాహనాలకు సంబంధించి యజమానులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని చెప్పారు. ఆయన వెంట అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, టూ టౌన్ సీఐ నిగిడాల సురేష్, రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సర్దార్ నాయక్, షీ టీమ్ అధికారి మాధురిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.