త్వరలో ప్రభుత్వ పాఠశాలకు రాక
ఉమ్మడి జిల్లాలో 2,73,001 మంది విద్యార్థులు
రెండు విడుతల్లో పంపిణీకి ఏర్పాట్లు
రామగిరి, జూన్ 22 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు. త్వరలో జిల్లా కేంద్రాలకు యూనిఫాం క్లాత్ రానుండగా వాటిని మండలాల వారీగా పంపించనున్నారు. అక్కడినుంచి ఎంఈఓలు పాఠశాలలకు తరలించనున్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్థానిక టైలర్లతో విద్యార్థులకు సరిపడే విధంగా కొలతలు తీయించి కుట్టించి అందజేయనున్నారు.
తొలి విడుతలో 5,63,342 మీటర్ల క్లాత్
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,121 ప్రభుత్వ పాఠశాలల్లోని 2,73,001 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ డ్రెస్ అందించనున్నారు. వీరికి రెండు విడుతల్లో జిల్లా విద్యాశాఖకు క్లాత్ ఇవ్వనుంది. ఒక్కో విడుతలో 5,63,342 మీటర్ల చొప్పున క్లాత్ పంపించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి డీఈఓలకు సమాచారం వచ్చింది. ఏ తేదీల్లో ఇవ్వనుందో స్పష్టంగా తెలియజేసింది.