సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్ లోడ్ వెరసి కరెంట్ సరఫరాలో అన్నీ సమస్యలే. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు పోల్స్, కనెక్షన్స్ కావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిందే. ఓవర్ లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా, లో ఓల్టేజీతో కరెంటు మోటర్లు కాలిపోయినా అంతిమంగా నష్టం ప్రజలకే. ముఖ్యంగా వ్యవసాయానికి కరెంట్ సరఫరాలో ఎన్నో ఆటంకాలు. ఎందుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ కనెక్షన్లు ఉన్న జిల్లా నల్లగొండనే. కానీ నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో కరెంట్ కష్టాలకు చెక్ పెడుతూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. 24 గంటల ఉచిత విద్యుత్ను నాణ్యంగా అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఏడేండ్లలో కొత్త జిల్లాల ప్రకారం ఒక్క నల్లగొండలోనే రూ.1171.60 కోట్లు వెచ్చించారు. కొత్త సబ్స్టేషన్లతోపాటు లైన్ల విస్తరణ, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ఇలా ఎన్నో చేపట్టారు. ఫలితంగా గృహ అవసరాలతోపాటు వాణిజ్య, వ్యవసాయం, పారిశ్రామికంగా పురోభివృద్ధికి తోడ్పాటు లభిస్తున్నది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో మరింత ఉపయుక్తంగా మారింది.
నల్లగొండ ప్రతినిధి, మే 7(నమస్తే తెలంగాణ) : 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి 2.90లక్షల పైచిలుకు వ్యవసాయ కనెక్షన్లతో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో లోఓల్టేజీ, వచ్చీ రాని కరెంటుతో ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు మోటార్లు కాలిపోయి ఎక్కువగా నష్టపోయింది కూడా జిల్లా రైతాంగమే. ఇక దీనికి తోడు రాత్రిళ్లు వచ్చీపోయే కరెంటుతో నిద్రలేని రాత్రులతో పాముకాట్లు, కరెంటు షాకులకు గురైన రైతుల్లోనూ మన జిల్లాదే ప్రముఖ స్థానం. యాసంగిలో వరి, బత్తాయి, నిమ్మతోటల లాంటి పంటలు ఎండడంతో కడుపు మండిన రైతులు కరెంటు కోసం రోడ్లెక్కడం సమైక్య పాలనలో నిత్యకృత్యంగా ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో 2018 జనవరి 1నుంచి అందిస్తున్న నిరంతర ఉచిత విద్యుత్ పథకంతో రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికే అత్యధికంగా లబ్ధి చేకూరుతున్నది. ఈ ఏడాది మార్చి 31నాటికి మొత్తం 4.63లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరుగుతున్నా కరెంటు సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేవు. నడివేసవిలోనూ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుండడం విశేషం.
భారీగా తగ్గిన మరమ్మతులు…
సమైక్య పాలనలో నల్లగొండ జిల్లాలో కరెంటు కోసం ఆందోళనలు నిత్యకృత్యం. లోఓల్టేజీతో పాటు కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ట్రాన్స్ఫార్మర్లు భారీగా కాలిపోయేవి. వాటి పరిధిలోని కరెంటు మోటార్లు సైతం కాలిపోయేవి. కొన్నిసార్లు స్టార్లర్లు చెడిపోయేవి. దాంతో రైతుల తీవ్రంగా నష్టపోయే వారు. కానీ నేడు నిరంతర విద్యుత్ సరఫరాతో అలాంటి కష్టాలకు చెక్పడినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లను పరిశీలిస్తే 2014-15లో మొత్తం 35,446 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే వాటిల్లో ఏడాది కాలంలో 17.59శాతంతో 6,238 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురయ్యేవి. ప్రస్తుతం 2021-22లో ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 69,530కి పెరుగగా వాటిల్లో ఏడాది కాలంలో మరమ్మతుకు గురైనవి 5,856 మాత్రమే. ఇవి మొత్తం సంఖ్యలో రిపేర్లు 8.42శాతమే. సగానికి తక్కువగా మరమ్మతుకు గురవుతున్నాయి. ఓ వైపు నిరంతర కరెంటు సరఫరాతో పాటు ఇచ్చే నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. దాంతో ఓవర్లోడ్, లోఓల్టేజీ సమస్యలకు చెక్పడింది. తద్వారా వ్యవసాయంలోనూ సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. పారిశ్రామికంగానూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
కనెక్షన్లు పెరిగినా నిరంతర సరఫరా
స్వరాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి జిల్లాలో 2.90లక్షలుగా ఉన్న వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య నేడు 4.63లక్షలకు పెరిగింది. 1.73లక్షల కనెక్షన్లు అదనంగా పెరుగగా అందులో ఉచిత విద్యుత్ ప్రారంభించిన తర్వాత పెరిగినవి 95వేలు కావడం విశేషం. అయినా సరే, ఎక్కడా ఇబ్బందుల్లేకుండా నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నది. దీంతో పంటలు ఎండిపోవడం లాంటి సందర్భాలు నాలుగున్నరేండ్లుగా కనిపించకుండా పోయాయి. రైతుల ఆందోళనలు సైతం మచ్చుకు కూడా కానరావడం లేదు. కేవలం ప్రకటనలతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. జిల్లాకు చెందిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడం మరింతగా ప్రయోజకనకరంగా మారింది. స్వయంగా మంత్రి జగదీశ్రెడ్డి నిరంతరం జిల్లాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో కరెంటు సరఫరాలో వేగంగా నాణ్యమైన సేవలకు ఆస్కారం ఏర్పడింది. దీనికి నల్లగొండ జిల్లాలోని గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఒక్క నల్లగొండలోనే రూ.1171.60కోట్ల వ్యయం..
నాణ్యమైన కరెంటు సరఫరా కోసం అనేక విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వేల కోట్లకు పైగా ఈ ఏడేండ్లలో వెచ్చించినట్లు అంచనా. ట్రాన్స్కో అధికారుల లెక్కల ప్రకారమే ఒక్క నల్లగొండ జిల్లాను తీసుకుని పరిశీలిస్తే రూ.1171.60కోట్లను అదనంగా ఖర్చు చేశారు. అధికారిక సమాచారం ప్రకారం ఒక్క నల్లగొండ జిల్లాలో 2014లో 1.40లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ప్రస్తుతం అవి 2.15లక్షలకు పెరిగాయి. వీటితో పాటు నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు లైన్ల విస్తరణ కూడా భారీగా పెరిగాయి. 2014లో 132/33 కేవీ సబ్ స్టేషన్లు కేవలం 8 ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్యను రూ.75కోట్లను వెచ్చించి 13కు పెంచారు. ఇక 33/11కేవీ సబ్ స్టేషన్లు 2014లో 123 ఉంటే ఏండేండ్లలో రూ.85.93కోట్లు వెచ్చించి 168కి పెంచారు. ఇక నల్లగొండ సర్కిల్లో విద్యుత్ లైన్ల విస్తరణను పరిశీలిస్తే గణనీయమైన తేడా కనిపిస్తున్నది. 33కేవీ ఓహెచ్ లైన్ అప్పట్లో 900కిలోమీటర్ల మేర ఉంటే దానిని ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో 1825కిలోమీటర్లకు విస్తరించారు. ఇందుకోసం అదనంగా రూ.74 కోట్లను వెచ్చించారు. 11కేవీ ఓహెచ్ లైన్ను 6526కిలోమీటర్ల నుంచి రూ.520కోట్లను వెచ్చించి 14013కిలోమీటర్లకు విస్తరించారు. రూ.232కోట్లను వెచ్చించి ఎల్టీ లైన్లను 23,046కిలోమీటర్ల నుంచి 32,415కిలోమీటర్లకు విస్తరించారు. ఇక క్షేత్రస్థాయిలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్లు 2014 జూన్ 2 నాటికి మొత్తం 36,447 ఉంటే ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.183.96కోట్లను ఖర్చు చేసి 69,787కు పెంచారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యనిస్తుందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.
ఇబ్బంది లేకుండా పని చేస్తున్నాం
తెలంగాణ ప్రభుత్వంలో నిరంతర కరెంటుతో ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో సరిగా కరెంటు లేక మోటర్ వైండింగ్, పంపు రిపేరు చేయడం ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం 24 గంటల విద్యుత్తో ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకు 6 మోటర్లు రిపేర్ చేస్తున్నాం. ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త అన్నట్లుగా పరిస్థితి మారింది.
–బైరోజు వెంకటాచారి, మోటర్ వైండింగ్ వర్క్స్, నార్కట్పల్లి
నిరంతర కరెంటుతో రైతుల్లో సంతోషం
గతంలో కరెంట్ సరిగా లేకపోవడంతో రైతులు పంట పొలాల వద్దనే పడిగాపులు కాస్తూ స్టాటర్లు పెట్టుకునేవాళ్లు. లోఓల్టేజీ సమస్యతో నిత్యం మోటర్లు కాలిపోయేవి. పొద్దస్తమానం మోటర్లను రిపేరు చేసెటోళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక నిరంతర కరెంట్తోపాటు లోవోల్టేజీ సమస్య తీరడంతో మోటర్లు కాలిపోవడం తగ్గింది. 24 గంటల కరెంట్తో రైతుల బాధలు తప్పినయి. ప్రస్తుతం మాకు గిరాకీ తగ్గినప్పటికీ రైతులు సంతోషంగా ఉన్నారు.
–శెట్టి యాదగిరి, మోటర్ మెకానిక్, నల్లగొండ
మోటర్ల వాడకం పెరిగింది
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంటు సరిగా ఉండపోవడంతో రైతులు మోటర్లను తక్కువ వినియోగించేవారు. అప్పుడు మోటర్లు రిపేరింగ్ పని కూడా తక్కువగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుండడంతో రైతులు చింత లేకుండా ఉన్నారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా మోటర్లను వాడుతున్నారు. వ్యవసాయ మోటర్ల రిపేరింగ్ పనులు కూడా ఎక్కువగా వస్తున్నాయి.
–రామిశెట్టి నరసింహారావు, మెకానిక్, హుజూర్నగర్