యాదాద్రి భువనగిరి, మే 5 (నమస్తే తెలంగాణ): నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ అగ్రిమెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీడీబీతో ఎంవోయూ చేసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 4న ‘మదర్ డెయిరీ భవితవ్యం ప్రశ్నార్థకం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంతో సర్కారులో చలనం వచ్చింది.
ఏకంగా సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో జీవో విడుదల కానుం ది. 15 ఏండ్ల పాటు నిర్వహణకు ఎంవోయూ చేసుకోనున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ – రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ యూ నియన్ లిమిటెడ్కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు డెయిరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహించనుంది.