సూర్యాపేట, మార్చి 14 : యాసంగి వరి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 281 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. మార్చి చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3,85,459 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సన్న రకం ధాన్యం 3,82,518 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 5,00,815 మెట్రిక్ టన్నులు కలిపి సుమారు 8,83,333 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేశారు. లోకల్ మార్కెట్ యార్డుల్లో అమ్మకాలు, మిల్లర్ల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోగా దాదాపు 5,07,721 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉండగా 3,54,896 మెట్రిక్ టన్నులు సేకరించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 281 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా వీటిలో 183 ఐకేపీ కేంద్రాలు, 98 పీఏసీఎస్ కేంద్రాలు ఉన్నాయి. 475 గ్రామ పంచాయతీల పరిధిలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 80 మిల్లులకు సీఎంఆర్ కోసం తరలించనున్నారు. ధాన్యం నింపేందుకు 90 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా ఇప్పటికే జిల్లాలో 39 లక్షల బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ప్రారంభం నాటికి మిగతా వాటిని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం గ్రేడ్-ఏ రకానికి రూ. 2,203 , కామన్ రకానికి రూ. 2,183 చెల్లించనున్నారు.
యాసంగిలో 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించినా లక్ష్యం చేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. పంటలు ఎండి పోతుండడంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సాగర్ ఎడమ కాల్వ నుంచి సాగు నీరు వదలక పోవడంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో వరి సాగు తగ్గింది. శ్రీరాం సాగర్ కాల్వలకు కాళేశ్వరం జలాలు రాకపోవడంతో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజక వర్గాల్లో సైతం వరి సాగు ఆశించినంత లేదు. 2022-23 యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4,62,709 ఎకరాల్లో వరిసాగు చేయగా ఈ సారి 3,82 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 80 వేల ఎకరాల్లో సాగు తగ్గింది. దాంతో రైతులు ధాన్యం అమ్మడానికి ముందుకు వస్తారా అనేది అనుమానంగా ఉన్నది. 3.54 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం అనుకున్నా రెండు లక్షల మెట్రిక్ టన్నులు దాటితే చాలు అనే విధంగా అధికారులు అంచనా వేస్తున్నారు.