యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్రపు పూజలు జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వైభంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో శత కలశాలను ఏర్పాటు చేసి శుద్ధ జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతోపాటు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు.
స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో నారసింహస్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు.
అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి, దర్బార్ సేవలతోపాటు ఊంజల్ సేవ నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు చేశారు. స్వామివారిని సుమారు 9 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఖజానాకు రూ.21,73,256 ఆదాయం సమకూరిందని ఈఓ రామకృష్ణారావు తెలిపారు.