భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 14 : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు మహర్దశ కలుగనున్నది. దీనిని సిల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన పారిశ్రామిక అవసరాలకు మానవ వనరులను తయారు చేసేందుకు రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సర్కారు భావించింది.
ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను స్కిల్ యూనివర్సిటీగా మార్చేందుకు పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. సంస్థలో ఉన్న సౌకర్యాలపై సమగ్ర నివేదిక అందించాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో సంబంధిత శాఖ అధికారులు అధ్యయనం చేయనున్నారు.
స్వామి రామానంద సంస్థలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. 100 ఎకరాల విశాలమైన స్థలంలో సంస్థను నెలకొల్పారు. మొత్తం పది భవనాలు ఉన్నాయి. అకాడమిక్ భవనంతోపాటు 4 కంప్యూటర్ ల్యాబ్లు, నాలుగు వర్ షాపులు, 400 మందికి సరిపడా నాలుగు హాస్టల్ భవనాలు ఉన్నాయి. రామానంద సంస్థను యూనివర్సిటీ స్థాయిలో తీర్చిదిద్దితే మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కార్యాచరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. సంస్థను అప్గ్రేడ్ చేసి త్వరలో 30 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రభుత్వపరంగా కల్పించనున్నారు.
స్వామి రామానంద గ్రామీణ సంస్థలో 7, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, డీటీపీ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెల్ఫోన్ మెకానిక్, ఎకౌంట్ అసిస్టెంట్, సోలార్ ఎనర్జీ, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి 17 రకాల కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన 2.50 లక్షల మంది నిరుద్యోగ యువత శిక్షణ పొందారు. ఇందులో 60 శాతం మంది యువతీ యువకులకు ఉద్యోగ కల్పనతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం (డీడీయూజీకేవై) కింద వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు రామానంద సంస్థను ఎంచుకుంది. కోర్సులకు నిధులు కేటాయిస్తుంది. సంస్థ నిర్వహణకు ఏటా 3.7 కోట్ల నిధులు అందిస్తుంది.
స్వామి రామానంద గ్రామీణ సంస్థను 1995లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ పేరు మీద నెలకొల్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 విస్తరణ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. సంస్థకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావివాళ్ల గోపాలకృష్ణయ్య, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నవనీత రావు, ఎంఎన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చిన్నారెడ్డి చైర్మన్గా వ్యవహరించారు. 2012 నుంచి రామానంద సంస్థకు చైర్మన్తోపాటు గవర్నింగ్ బాడీ కూడా ఏర్పాటు చేయ లేదు. ప్రస్తుతం సంస్థకు ఇన్చార్జి డైరెక్టర్ల పాలన కొనసాగుతున్నది. నిధుల లేమితో కొత్త కోర్సులు ప్రవేశపెట్టలేక విస్తరణ కేంద్రాలు మూతపడ్డాయి. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను నైపుణ్య యూనివర్సిటీగా తీర్చిదిద్దితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.