ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రెవెన్యూలోనూ పేట మున్సిపాలిటీ టాప్
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు
చైర్పర్సన్, కమిషనర్కు పురస్కారం అందజేత
బొడ్రాయిబజార్, మే 13 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్ర్టానికే రోల్మోడల్గా మారుతుందని కితాబిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న పట్టణ ప్రగతిపై హైదరాబాద్లోని జెన్కో ఆడిటోరియంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. కర్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ సమయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయంలో జరిగిన సభను ఈ సందర్భంగా గుర్తుచేశారు. దసరాలోపు నిర్మాణం పూర్తి చేస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకొందామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే మొదటిస్థానం…
ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రెవెన్యూలోనూ రాష్ట్రంలో సూర్యాపేట మున్సిపాలిటీ మొదటి స్థానం నిలిచింది. లక్షకుపైగా జనాభా కలిగిన పురపాలికల్లో అధిక ఆదాయాన్ని ఆర్జించడంతో చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, కమిషనర్ రామానుజులరెడ్డికి మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ అవార్డును అందజేశారు. మూడేండ్లలో 250శాతం ఆదాయాన్ని పెంచుకుని సూర్యాపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అభినందించారు. అభివృద్ధి, శానిటేషన్లో ప్రత్యేకతను చాటుకున్నదని పేర్కొన్నారు. పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ శానిటేషన్లో సూర్యాపేట సూపర్ అని కితాబు ఇవ్వడంతోపాటు చైర్పర్సన్, కమిషనర్ను సభకు పరిచయం చేశారు.