సూర్యాపేట సిటీ, డిసెంబర్ 19 : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు, ఫిర్యాదుదారులకు భరోసా, నమ్మకాన్ని కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి అని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. పోలీస్ రిసెప్షన్ సెంటర్స్, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం నిర్వహణపై మంగళవారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆయన సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ఉండాలని, పోలీసు శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలని సూచించారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై స్పందించి ప్రాథమిక విచారణ వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, రసీదు ఇచ్చి పారదర్శకత చూపాలని అన్నారు. పిటిషన్ మేనేజ్మెంట్, రిసెప్షన్ సెంటర్ నిర్వహణపై జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నామని చెప్పారు.
ప్రతి సోమవారం పోలీస్ ప్రజావాణి
బాధితుల ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడానికి ప్రతి సోమవారం మధ్యాహ్నం 2:30గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సెంట్రల్ కంప్లయింట్ సెల్ ద్వారా జిల్లా పోలీసు కార్యాలయంలో 28 ఫిర్యాదులు పరిశీలించినట్లు తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, చట్టం ఉల్లంఘనకు పాల్పడి దాడులు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. సివిల్ తగాదాలు, భూ సమస్యలను కోర్టుల పర్యవేక్షణలో పరిష్కరించుకోవాలని కోరారు.