సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 19 : రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్, ఎన్హెచ్-65 పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ రహదారి సుమారు 80 కిలోమీటర్లు విస్తరించి ఉందని, ఈ మార్గం వాణిజ్య, రవాణా పరంగా ఇతర రాష్ర్టాలను కలుపుతూ నిత్యం రద్దీగా ఉంటుందని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఎస్పీ తెలిపారు. ఈ మార్గంలో లోపాలను గుర్తించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ లోపాలున్నాయని, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మధ్యలో డివైడర్ను కట్ చేశారని, గ్రామాల నుంచి వచ్చే లింక్ రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు.
సర్వీస్ రోడ్లు పూర్తి కాలేదని, గ్రామాల వద్ద సూచిక బోర్డులపై అవగాహన లోపం ఉందన్నారు. చాలా జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల అవసరం ఉందని, పాసెజ్ల హైట్ కూడా తక్కువగా ఉండడంతో పెద్ద వాహనాలు వెళ్లడం లేదన్నారు. హైవేపైకి వచ్చే గ్రామీణ రోడ్లు సరైన లెవల్ లేవని, అవసరమైన చోట సైన్ బోర్డుల ఏర్పాటుతోపాటు సెంట్రల్ లైటింగ్ తక్కువగా ఉందన్నారు. వీటిని ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్ అధికారులు సమన్వయంతో సవరించేందుకు కృషి చేయాలన్నారు.
ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్ అధికారులు మాట్లాడుతూ ఎన్హెచ్-65పై ఇప్పటికే చాలా జంక్షన్లు, బ్లాక్ స్పాట్స్ వద్ద ఇంజినీరింగ్ లోపాలను సవరిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అన్ని లోపాలను సవరిస్తామని, సెంట్రల్ లైటింగ్ పెంచుతామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్మీనా, ఎన్హెచ్ -65 టెక్నికల్ మేనేజర్ రాధేశ్యాం పైనీ, ఎన్హెచ్ఏఐ మేనేజర్ శ్రీకాంత్, జీఎంఆర్ అధికారులు మల్యాద్రినాయుడు, నాగకృష్ణ, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జితేందర్రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, రజితారెడ్డి, చివ్వెంల, మునగాల, కోదాడ రూరల్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు, రోడ్డు సేఫ్టీ బ్యూరో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.