ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అన్నీ సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. లక్షన్నర నుంచి రెండు లక్షల మంది జనం వచ్చే అవకాశాలు ఉండడంతో తదనుగుణంగా వసతులు కల్పించేలా చూడాలని తెలిపారు.
ఆదివారం మంత్రి జగదీశ్రెడ్డి.. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, భూపాల్రెడ్డి, కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవితో కలిసి ప్రారంభోత్సవ భవనాలను, సభ కోసం రెండు స్థలాలను పరిశీలించారు.
సూర్యాపేట, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సూర్యాపేటలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యుత్శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పనులు ప్రారంభించింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్తో పాటు మరో రెండు ప్రారంభోత్సవాలు చేయనుండగా.. భారీ బహిరంగ సభ జరుగనుంది.
ఆదివారం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ కొత్త భవనాలతో పాటు బహిరంగ సభ నిర్వహణ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. సభకు నియోజకవర్గం నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల మంది హాజరవుతారనే అంచనాలు ఉండగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు మంత్రి జగదీశ్రెడ్డి చర్యలు చేపడుతున్నారు. సీఎం ప్రారంభించే భవనాల పనులు దాదాపు పూర్తి కాగా ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఐదు రోజుల్లో పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
సీఎం కేసీఆర్ పర్యటన రూట్మ్యాప్పై మంత్రి ఆదివారం కలెక్టర్, ఎస్పీలతో చర్చించారు. పట్టణంలో భారీ బహిరంగ సభ కోసం కొత్త కలెక్టరేట్, వ్యవసాయ మార్కెట్ సమీపంలోని స్థలాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వారిని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఎంత మంది వచ్చినా ఇబ్బందులు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేయనున్నారు.