సూర్యాపేట, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం చేపట్టిన రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి పట్టణంలోని చిన్నకొండూరు చౌరస్తా వరకు సుమారు 6కిలోమీటర్ల రోడ్ షో కనీవినీ ఎరుగని రీతిన వేలాది మంది జనం కేటీఆర్ కాన్వాయ్తో పాటు ముందుకు సాగింది. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో జనం నుంచి పెద్ద ఎత్తున కేరింతలు, చప్పట్లతో ఉత్సాహంగా కనిపించారు. ర్యాలీ చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కడం కష్టమే అనిపిస్తుందని కేటీఆర్ అనడంతో జనం పెద్ద ఎత్తున కేకలు వేశారు. అసలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగోడులో ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో వివరించారు. 2018లో పొరపాటుతో ఒక నాయకున్ని కాంగ్రెస్ పార్టీపై గెలిపిస్తే మొదటి రోజు నుంచి బీజేపీతో బేరమాడి కోవర్టు రాజకీయాలు చేసి గుజరాతీ మోడీ నుంచి రూ.18వేల కాంట్రాక్ట్ దక్కగానే పార్టీ మారి రాజీనామా చేశాడని విమర్శించారు. నల్లగొండ ఫ్లోరోసిస్ తీర్చడానికి రూ.19వేల కోట్లు ఇవ్వడానికి మనసొప్పదు గానీ కోమటిరెడ్డికి 18వేల కోట్లు ఎలా ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు.
నాడు మోదీ అకౌంట్లు తెరవండి రూ.15లక్షలు వేస్తామని చెప్పి వేయకుండా అవన్నీ రాజగోపాల్రెడ్డి ఖాతాలో వేశారని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తానని ఆడబిడ్డలకు చెబుతున్నారని, బరాబర్ తీసుకొని ఓటు మాత్రం మీకు అండగా ఉండే టీఆర్ఎస్ పార్టీకి వేయాలని కోరారు. 75ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసింది టీఆర్ఎస్ పార్టీ… చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. దమ్ముంటే ఇక్కడ అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను తమ రాజకీయ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందని చెప్పగల నాయకుడు ఉన్నాడా అంటూ సవాల్ విసిరారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనడానికి గుజరాత్ పెద్దలు వేస్తున్న ఎర రాజగోపాల్రెడ్డి అన్నారు.
మునుగోడును దత్తత తీసుకుంటా
సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు చెప్పమంటే వందున్నాయ్ రెండు మున్సిపాల్టీలు చేసినా భవిష్యత్లో గెలిస్తే దత్తత తీసుకుంటామని చెబుతున్నాం. రేపు మీరు అడగండి రాజగోపాల్రెడ్డి వస్తే మీ మోదీ ప్రబుత్వం ఏ ఒక్కరికైనా నయా పైసా పని చేసిందా దమ్ముంటే చెప్పి ఓటు అడగాలని సూచించారు. తమ ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టే రాజగోపాల్రెడ్డి వదిలేసిన ఈ నియెజకవర్గంలో 79వేల మందికి రైతుబంధు, 43వేల మందికి ఆసరా పింఛన్లు, 9,900 కల్యాణలక్ష్మి, 9500కేసీఆర్ కిట్లు అందాయన్నారు. 1189మంది రైతులకు రైతు బీమా మునుగోడు నియోజకవర్గంలో ఇచ్చామన్నారు. దండు మల్కాపుర్ పోయి చూడండి ఆసీయాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ 580ఎకరాల్లో శంకుస్థాపన చేయగా 200 కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. నాడు జేపీ నడ్డా ఆరోగ్యమంత్రిగా 2016లో వచ్చి 300 పడకల ఆస్పత్రిని మర్రిగూడలో కడుతా అన్నడు. సామాజిక భద్రత ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు ఇస్తా అన్నాడని, మరి ఇచ్చిండా అని బీజేపీ వారిని అడగాలన్నారు.
మోదీ చెప్పిన 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
నరేంద్రమోదీ ప్రతి యేడాది 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇస్తుండా అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు మొత్తం తెలంగాణలో అత్యధికగా వరి పండించే జిల్లా ఏది అంటే నల్లగొండ అని చెప్పే అదృష్టం సీఎం కేసీఆర్ వల్ల వచ్చిందన్నారు. మర్రిగూడెం, మునుగోడు, నారాయణపురం, గట్టుప్పల్, చౌటుప్పుల్లో ప్రతి ఒక్కరి బాధ తెలుసు ఇక్కడ పిల్లను ఇవ్వాలంటే ఫ్లోరోసిస్ ఉందంటా పిల్లలు వికలాంగులుగా పుడుతారంటా అని ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడే పరిస్థితి నుంచి నేడు కేసీఆర్ మిషన్ భగీరథ చౌటుప్పల్లో పైలాన్ వేసి ఫ్లోరోసిస్ను శాశ్వతంగా రూపు మాపింది కేసీఆర్ కాదా అన్నారు. 60యేండ్లలో ఫ్లోరోసిస్ భూతాన్ని పెంచి మాకు అప్పగిస్తే నాలుగేండ్లలో దాన్ని అంతమొందించింది సీఎం కేసీఆర్ కదా అన్నారు. శివన్నగూడెం, లక్ష్మణపురం రిజర్వాయర్లు రెండు మొదలు పెట్టి 60, 70శాతం పనులు పూర్తి చేసినా. మళ్లీ ఎమ్మెల్యే సమక్షంలో కేసీఆర్ను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది. ఒక్కసారి గెలిపిస్తే జనాన్ని గాలికి వదిలి నియోజకవర్గాన్ని అధ్వాన్నంగా మార్చిన రాజగోపాల్రెడ్డికి గట్టి బుద్ధి చెప్పి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన దొంగ రాజగోపాల్రెడ్డి:మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని తాకట్టు పెట్టి బీజేపీ విసిరిన రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఘనుడు రాజగోపాల్రెడ్డి అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చిన్నకొండూరు చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ రూ. 40వేల కోట్లతో తెలంగాణలో విద్యుత్ వెలుగులు నింపితే.. అందుకోసం కేంద్రం రూపాయి ఇవ్వలేదని తెలిపారు. ఫ్లోరైడ్ రక్కసితో ఈ ప్రాంత బిడ్డలు దివ్యాంగులుగా మారి ఆవేదన చెందుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ సీఎంగా పదవి చేపట్టిన వెంటనే రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ పథకానికి కనీసం రూ.19 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. కేవలం బీజేపీ నుంచి కాంట్రాక్ట్ పొందడం కోసమే రాజగోపాల్రెడ్డి ఈ ఉపాయానికి తెర లేపారన్నారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే చౌటుప్పల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.
చర్లగూడెం రిజర్వాయర్తో మీ కాళ్లు కడుగుతా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యేగా నాకు మరొకసారి అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్ను ఒప్పించి చర్లగూడెం రిజర్వాయర్ పూర్తిచేయించి, ఆ నీళ్లతో మీ కాళ్లు కడుగుతానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. 2014లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రూ.వందల కోట్లతో మునుగోడు అభివృద్ధికి బాటలు వేశానని గుర్తు చేశారు. ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన రాజగోపాల్రెడ్డి బీజేపీ ఇచ్చిన కాంట్రాక్టుకు మోసం చేశారని ధ్వజమెత్తారు. గెలిచి నాలుగేండ్లు కావస్తున్నా ఈ ప్రాంత ప్రజలకు ఆయన అందుబాటులో లేరన్నారు. గెలుపోవటములకు అతీతంగా నేను మీ వెంటే ఉన్నానని, మరొకమారు గెలిపిస్తే మీ సేవకుడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణను ఆగం చేసేందుకు మోదీ కుట్ర -మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణను ఆగం చేసేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారు. మోదీ, అమిత్షా ఇద్దరు కలిసి తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చింది. తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ ఇస్తున్న పథకాలకు యావత్ దేశం జేజేలు పలుకుతుంది. కేసీఆర్ను దక్షిణాది సూర్యుడిగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలి:పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకుడు
కేవలం తన కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ని చిత్తుగా ఓడించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తూ తెలంగాణని ఆగం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మునుగోడులో బీజేపీకి ప్రజా బలమే లేదు. కేవలం డబ్బులు వెదజల్లి రాజగోపాల్రెడ్డి రాజకీయ కుయుక్తులకు పాల్పడుతున్నారు. నిత్యం నిత్యావసర ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కకుండా బుద్ధి చెప్పాలి. సీపీఐ, సీపీఎం బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.
ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి రాజగోపాల్రెడ్డి చేసింది శూన్యం:చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
ఎంతో నమ్మకంతో ఓటు వేసి ఎమ్మెల్యేగా రాజగోపాల్రెడ్డి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసింది శూన్యం. కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ ప్రజల శ్రేయస్సుపై ఆయనకు లేదు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. ఉప ఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించాలి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలి.