సూర్యాపేట సిటీ, ఫిబ్రవరి 13 : మహావీర్ చక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు 39వ జయంతి సందర్భంగా సోల్జర్స్ యూత్ ఫౌండేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో స్థానిక సంతోష్బాబు చౌరస్తా నుంచి కాసరబాద వరకు ఆదివారం ఉదయం నిర్వహించిన 5కే రన్ను సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్బాబు దేశ పౌరులందరికీ ఆదర్శప్రాయుడన్నారు. యువత సైన్యంలో చేరి కర్నల్ సంతోష్బాబు ఆశయ సాధన కోసం పాటుపడాల్సిందిగా కోరారు. అనంతరం కేసారంలోని సంతోష్బాబు సమాధి వద్ద విన్నర్స్కు బహుమతి ప్రదానం చేశారు. సోల్జర్స్ యూత్ ఫౌండేషన్ స్థాపకుడు కర్నల్ సుంకరి శ్రీనివాస్రావు మాట్లాడుతూ 5కే రన్లో 96 మంది యువకులు, 12మంది యువతులు పాల్గొనగా జిల్లా కేంద్రానికి చెందిన నవ్యశ్రీ ప్రథమస్థానంలో నిలిచినట్లు తెలిపారు. కర్నల్ సంతోష్బాబు తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల, డీఎస్పీ మోహన్కుమార్, సీఐ ఆంజనేయులు, పీడీలు గడ్డం వెంకటేశ్వర్లు, ఎన్సీసీ విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల నివాళి
బొడ్రాయిబజార్ : దివంగత కర్నల్ సంతోష్బాబు 39వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఆయన విగ్రహానికి సంతోష్బాబు సతీమణి సంతోషి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతోష్బాబు సతీమణి మాట్లాడుతూ తన భర్త జయంతిని ఇక్కడ జరుపుకోవడం ఆయన సమక్షంలో జరుపుకున్నంత ఆనందంగా ఉందన్నారు. అనంతరం వివేకానంద వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, సాయిబాబా ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేశారు.