సూర్యాపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటుకు ముందు అభివృద్ధి ఆనవాళ్లు కనిపించేది కాదు..సంక్షేమ పథకాల ఊసే లేదు.. రహదారుల దుస్థితి మరీ దారుణంగా ఉండేది.. గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే రహదారులను చూస్తే అవి రోడ్లు అని గుర్తించలేని దుస్థితి ఉండేది. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే నీళ్లు, రహదారులు, విద్యుత్ సక్రమంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల సరఫరాతో విద్యుత్ వస్తుండగా నీటి కరువు లేకుండా పోయింది. రహదారుల విషయానికి వస్తే ఎనిమిదిన్నరేండ్లుగా రహదారుల నిర్మాణాలు, విస్తరణ కోసం ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించింది. సూర్యాపేట నియోజకవర్గంలో గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ 500 జనాభా ఉన్న ప్రతి తండా, అవాసాలను గ్రామ పంచాయతీలు చేయడంతో తాజాగా ఆయా తండాలకు కూడా బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నారు. \
50 కిలోమీటర్లు..45 కోట్లు
సూర్యాపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలోని 15 ప్రాంతాల్లో కొత్తగా 50 కిలోమీటర్ల మేర బీటీ రహదారులను నిర్మించేందుకు రూ.45 కోట్లు మంత్రి జగదీశ్రెడ్డి విడుదల చేయించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు పూర్తి కాగా గ్రామాల్లో అంతర్గత రహదారులు సైతం దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. 500 జనాభా కలిగిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో నేడు వాటికి కూడా లింక్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. తాజాగా వచ్చిన రూ.45 కోట్లతో సూర్యాపేట మండలంలో టేకుమట్ల- పిన్నాయిపాలెం వరకు 2.5 కిలోమీటర్లు, పిల్లలమర్రి-రాయినిగూడెం టు కేటీ అన్నారం 5.5 కిలోమీటర్లు, యండ్లపల్లి -శివాలయం 2.4 కిలోమీటర్ల దూరం బీటీ రహదారులు రాబోతున్నాయి.
పెన్పహాడ్ మండలంలో తిరుమలగిరి – గాజులమల్కాపురం 4 కిలోమీటర్లు, లాల్సింగ్తండా -సీతారాంపురం 4 కిలోమీటర్లు వేయనున్నారు. చివ్వెంల మండలంలో ఖమ్మం పీడబ్ల్యూడీ రోడ్ – సూర్యనాయక్తండా వరకు 2 కిలోమీటర్లు, చందుపట్ల జడ్పీ రోడ్డు- మొగ్గయ్యగూడెం 3 కిలోమీటర్లు, గుంజలూరు-నేలమర్రి 2.5 కిలోమీటర్లు, చివ్వెంల ముకుందాపురం రోడ్డు -ఎస్డీ రోడ్డు వరకు 6.5 కిలోమీటర్లు అలాగే టీకం తండా-బంగారితండా వరకు 1.1 కిలోమీటర్ల దూరం బీటీగా మారనుంది. ఆత్మకూర్.ఎస్ మండలం దంతాలపల్లి పీడబ్ల్యూడీ- దుబ్బతండా వరకు 1.60 కిలో మీటర్లు, చివ్వెంల-ముకుందాపురం పీడబ్ల్యూడీ -గంగదేవమ్మ దేవాలయం 6 కిలోమీటర్లు ఉండగా ఆత్మకూర్.ఎస్ ఎక్స్ రోడ్డు – తుమ్మలపెన్పహాడ్ 3 కిలోమీటర్లు, ఆత్మకూర్.ఎస్- గుడితండా 3.5 కిలోమీటర్లు, పాత సూర్యాపేట టు దాస్తండా 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్నారు.
మా తండాకు డాంబర్ రోడ్డు చూస్తననుకోలే
నాకు గుర్తెగిన కానుంచి కాటికి వెళ్తున్న వయస్సుకు వచ్చింది. నా పొలం కాడికి పోవాలంటే ఎన్నో సార్లు తాకుడు రాళ్లు తగిలాయి. రక్తాలు కరాయి. ఎందరికో మొకాలు చిప్పలు పగిలాయి. అయినా ఈ రోడ్డు నుంచె పోక తప్పలేదు. ఈ రోడ్డుకు బాగు పడుతది అనుకోలె. మొన్న మొన్న మా ఊరి గుడి దగ్గర కూర్చుంటే పలానా రోడ్డు వేస్తరంట డాంబర్ పడుతుందందని తెలిసింది. అటుగా పోతున్న మా సర్పంచ్మ్మను అడిగితే అవును తాత మంత్రి జగదీశ్రెడ్డి పుణ్యమంటూ రోడ్డు వచ్చింది. మన ఊరోలందరూ మండలానికి పోవాలన్నా..మీ బావుల దగ్గరికి పోవాలంటే ఇబ్బందులుండవు అంది. ఇప్పుడు డాంబర్ రోడ్డు వస్తుందంటే సంతోషంగా ఉంది.
– భూక్యా మంగ్యా, రైతు,లాల్సింగ్తండా, పెన్పమాడ్
ఐదు నెలల్లో పూర్తి
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో రోడ్లు లేని గ్రామాలకు బీటీ రహదారుల నిర్మాణనికి రూ.45 కోట్ల సీఆర్ఆర్ గ్రాంట్ విడుదలైంది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. వచ్చే 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి నాలుగు నుంచి ఐదు నెలల్లో పనులు పూర్తి చేయిస్తాం.
-డి.మనోహర్, డీఈ పంచాయతీరాజ్
ఎన్నో ఏండ్ల కల తీరడం అదృష్టం
మా తండా వాసుల ఎన్నో ఏండ్ల కల తీరడం అదృష్టం. గతంలో మా తండాకు నడుచుకుంటూ రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వర్షాకాలం వస్తే మొత్తం బురద మయం, ఎండకాలం అయితే దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. గత ఎన్నికల్లో హామీ మేరకు మంత్రి జగదీశ్రెడ్డి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం మర్చి పోలేనిది. ఎంతో మంది నాయకులు మాకు హామీ లు ఇచ్చి మళ్లి తిరిగి చూసింది లేదు. మంత్రి జగదీశ్రెడ్డికి మా తండా వాసులం రుణపడి ఉంటాం.
– ధరావత్ వీరన్న, సూర్యానాయక్ తండా, చివ్వెంల మండలం