చండూరు, జూలై 23 : పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 పోటీల్లో ముందంజల్లో నిలిచేందుకు మున్సిపాలిటీలు సన్నద్ధమవుతున్నాయి. త్వరలో కేంద్ర బృందాలు పర్యటించి అవార్డులకు ఎంపిక చేయనున్న ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, పరిశుభ్రత చేపట్టడంతో పాటు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు ముమ్మరంగా సర్వే కొనసాగుతున్నది. ఈ సర్వేలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ర్యాంకులు సాధించడం కోసం మున్సిపల్ సిబ్బంది సెలవు రోజుల్లో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. ఈ సర్వేలో మున్సిపల్ బిల్ కలెక్టర్, మెప్మా రిసోర్స్ పర్సన్లు భాగస్వాములు అవుతున్నారు.
రోజుకు కనీసం 50 మందితో సర్వే నిర్వహించాలని లక్ష్యం ఉండడంతో ఇంటింటికీ వెళ్లి ఇంటి యజమాని స్మార్ట్ ఫోన్తో స్వచ్ఛ సర్వేక్షణ్ క్యూఆర్ కోడ్ సాన్ చేయించి సర్వేలో ఉన్న ఏడు ప్రశ్నలకు సమాధానం రాబడుతున్నారు. ఈ సర్వే ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. తదుపరి మున్సిపాలిటీల వారీగా ర్యాంకులను కేటాయించి వారికి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. పట్టణాల్లో పరిశుభ్రత పారిశుధ్యం నిర్మూలనకు మున్సిపాలిటీల మధ్య పోటీ పెరిగి స్వచ్ఛ మున్సిపాలిటీగా మారేందుకు ఈ సర్వే దోహదపడుతుంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా 15 వేల లోపు జనాభా గల చిన్న మున్సిపాలిటీల్లో చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి. చండూరు మున్సిపాలిటీకి బెస్ట్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీగా అవార్డు రాగా, చిట్యాల మున్సిపాలిటీకి ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టిసెస్ అవార్డు లభించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో ఉత్తమ ర్యాంకు సాధించిన చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పారిశుధ్య పరిశుభ్రత కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చెత్త సేకరించేందుకు వాహనాల కొనుగోలుతో పాటు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, ప్రధాన కూడలిలో చెత్త వేయడం ప్రత్యేకమైన తడి, పొడి చెత్త బాక్సులు ఏర్పాటు వంటి వాటికి కేటాయించనున్నారు.
1. మీ ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరిస్తున్నారా
2. మీ ఇంట్లో వ్యర్థాలను రోజువారీగా తడి,పొడి చెత్తను వేరు చేస్తున్నారా
3. మీ ఇంటి పరిసరాల్లో మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉన్నాయా
4. రెడ్యూస్ రియూస్ రీసైక్లింగ్ సెంటర్ గురించి మీకు తెలుసా
5. కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారా
6. మీ పరిసరాల్లోని పరిశుభ్రతకు మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారు
7 .మీ పట్టణంలో పరిశుభ్రతకు మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారు.
15 వేల లోపు జనాభా గల మున్సిపాలిటీలు..
నల్లగొండ జిల్లాలో పాతవి నల్లగొండ, మిర్యాలగూడతో పాటు కొత్తగా చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, నందికొండ, నకిరేకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 15 వేల లోపు జనాభా కలిగినవి చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు గతేడాది అవార్డులు వరించాయి. ఈ ఏడాది కూడా అవార్డులు సొంత చేసుకునేందుకు ఆయా మున్సిపాలిటీ సిబ్బంది గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముమ్మరంగా నిర్దేశించిన ఆదేశాల మేరకు వివరాలను నమోదు చేస్తున్నారు.
ప్రజలు భాగస్వాములయితేనే మున్సిపాలిటీలను స్వచ్ఛ మున్సిపాలిటీలుగా మార్చుకుంనేందుక సాధ్యమవుతున్నది. ప్రజలను ఎప్పటికప్పుడు అవగాహన పరుస్తు చండూరు మున్సిపాలిటీని ఆదర్శమున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. చండూరును పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి. రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకూడదు. వాహనాల ద్వారా నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు పంపిస్తున్నాం.
– ఖాజా మొయిజుద్దిన్, మున్సిపల్ కమిషనర్, చండూరు