రామగిరి (నల్లగొండ), మే 19 : దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన త్యాగదనుడని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్ర భాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారన్నారు.
వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి, జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు. 1934 వ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి,వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని కొనియాడారు. పార్లమెంటుకు, శాసనసభకు సైకిల్పై వెళ్లేవారన్నారు. సమాజమే తన పిల్లలు అనుకుని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
నేడు ఎంతోమంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని, విలువలను మరిచి అక్రమ సంపాదనకు, పదవి వ్యామోహంతో డబ్బు కోసం పార్టీలు మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. నేటి యువత సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎండీ.సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నలపరాజు సైదులు, ఆకారపు నరేశ్, పోలే సత్యనారాయణ, బి.పరిపూర్ణ చారి, భూతం అరుణకుమారి, రవీ, నరసింహ పాల్గొన్నారు.