యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు. స్వయంభువులకు నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు.
అనంతరం స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజ వాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీ సమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్యకల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామి వారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.11,65,964 ఆదాయం సమకూరింది.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పూజలు
లక్ష్మీనారసింహులను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం కొండపైకి చేరుకున్న ఆయన మొదటగా నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పాలతో చేపట్టే సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారి వాసం వెంకటేశం స్వామి వారి ప్రసాదం అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన నాయకుడు ఆవుల సాయి ఉన్నారు.