మోత్కూరు,డిసెంబర్ 8: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ సీడ్ గార్డెన్, నర్సరీలను పరిశీలించింది. కొత్తరకం విత్తనాల ఉత్పత్తిని పరిశీలించి, నర్సరీలో మొక్కల పెంపకం సంబంధించి షెడ్ నెట్లలో విత్తనాలు నాటినప్పుటి నుంచి మొక్కలు ఇచ్చే వరకు వాటి సంరక్షణలో తీసుకుంటున్న మెళకువలను తెలుసుకున్నారు.
అనంతరం మలేషియా సాంకేతిక నిపుణులతో సమావేశమై సీడ్ గార్డెన్లో ఉన్న విత్తనాల రకాలు వాటి పెరుగుదల, దిగుబడి,కాల పరిమితిని సమీక్షించారు. కార్యక్రమంలోఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి, మేనేజర్లు జెన్ను సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, బాలకృష్ణ, కళ్యాణ్, నాగబాబు, పవన్, పీజీవీ ప్రతినిధులు సత్యనారాయణ, శ్యాంసుల్, లూ, నూరిజాన్ పాల్గొన్నారు.