నల్లగొండ, ఏప్రిల్ 1 : గ్రామాల్లో మురుగు కాల్వల నీరు పంట పొలాల్లోకి వెళ్లి సమస్యగా మారుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని పంచాయతీ శాఖాధికారులను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో 1,4,2,7 స్థాయి సంఘం సమావేశాల్లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. స్థాయీ సంఘం సమావేశాలతో పాటు జడ్పీ జనరల్ బాడీకి ప్రతి శాఖ నుంచి ఉన్నతాధికారులే హాజరు కావాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గురుకుల కళాశాల విద్యార్థులకు న్యూట్రీషన్ ఫుడ్ అందేలా చూడడంతో పాటు, మెడిటేషన్ చేయించాలని సూచించారు. పాఠశాలలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు కమిటీ సభ్యులను ఆహ్వానించాలన్నారు. అంగన్ వాడీలు పోషక్ అభియాన్ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఉపాధి హామీ కాంపోనెంట్ నిధుల విడుదలలో ఆలస్యం చేయొద్దు : ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులకు మెటీరియల్ కాంపోనెంట్ కింద రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. స్వయం సహకార సంఘాలకు స్త్రీ నిధి రుణాలు ఇచ్చి ఎప్పటికప్పుడు రికవరీ చేయాలన్నారు. ఇప్పటికే ధాన్యం కోతలు మొదలైనందున ఎక్కువ మొత్తంలో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు వేగం చేయాలన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం జరిగినందున ప్రభుత్వం ఇచ్చే పరిహారం వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ.3లక్షలు ఇస్తున్నందున దీనికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో స్థాయీ సంఘం చైర్మన్లు నారగోని స్వరూపారాణి, కంకణాల ప్రవీణ, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.