సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొమ్మిదేండ్లలో జరిగిన ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సంబురంగా సాగింది. వాడవాడల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 15 వేల మందికి పైగా తరలివచ్చారు. జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా రావడంతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. అనంతరం జరిగిన సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ శాతాన్ని పెంచిందే బీజేపీ, కాంగ్రెస్ అని, ఆ పార్టీలే రాష్ట్రంలో పేపర్ లీకేజీల పర్వానికి తెర లేపాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో లక్షా 32 వేల 649 ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి తోడ్పాటునందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పు కణిక అని, ముట్టుకుంటే భస్మం అవుతారని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల రాకతో సూర్యాపేట సస్యశ్యామలమైందని, మూసీ కాల్వల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కోదాడ, ఏప్రిల్ 16 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా పని చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడి ఇంటిని అక్రమంగా ఖాళీ చేయిస్తే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సోయి లేకపోగా బీజేపీతో అంటకాగి తిరుగుతున్నారన్నారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో లీకేజీల పర్వానికి తెర లేపాయని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని దుయ్యబట్టారు. అటువంటి పార్టీలు నిరుద్యోగులకు వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిన కాంగ్రెస్, బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో 1,32,649 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏకకాలంలో 23వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. మరో 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి ప్రక్రియ మొదలు పెట్టగానే లీకేజీ కుట్రలకు తెరలేపి నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దేశంలో 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పిన మోదీ నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ భర్తీ చేసిన విధంగా కేంద్రం ఈ తొమ్మిదేండ్లలో ఏటా రెండు కోట్ల చొప్పున భర్తీ చేసి ఉంటే తెలంగాణ నుంచి ఇప్పటికే తొమ్మిది కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కనీసం పది వేల మందికైనా ఉద్యోగావకాశాలు కల్పించారా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. 25ఏండ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్లో కనీసం 30వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సంగతి సరేసరి అంటూ బీజేపీపై వ్యంగాస్ర్తాలు సంధించారు. అటువంటి బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీ టీమ్గా మారి లీకేజీల పర్వానికి తెరలేపిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వారికి వణుకు పుడుతున్నదని, అందుకే లీకేజీ డ్రామాలకు తెరలేపి లబ్ధి పొందే యత్నం చేసున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పుకణిక అని, ముట్టుకోవడం కాదు.. జోలికి వస్తేనే భస్మం అవుతారని మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకుపోతుందా? అన్న అనుమానాలు రేకిత్తిస్తున్నదన్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్లో మీడియా, పోలీసుల ముందే జరిగిన హత్య ఉదంతాన్ని మంత్రి ఉదహరించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమగ్రాభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిందన్నారు. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని ఆయకట్టు చివరి ప్రాంతాలకు కాళేశ్వరం గోదావరి జలాలు అందడంతో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయని తెలిపారు. మూసీ కాల్వల ఆధునీకరణతోపాటు చెక్డ్యామ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఎత్తిపోతల పథకాలతో జిల్లాలో మరింత సాగు సాధ్యమైందని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీర్వదించగా, పార్టీ ముఖ్య నాయకులు గజమాలతో సత్కరించారు. సమావేశంలో జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, నాయకులు పైడిమర్రి సత్తిబాబు, ఆల్తాఫ్ హుస్సేన్, ఈదుల కృష్ణయ్య, నల్లపాటి శ్రీనివాస్, రాయపూడి వెంకటనారాయణ, వల్లూరి రామిరెడ్డి, కందిబండ సత్యం, అనంతు సైదయ్య, వక్కవంతుల నాగార్జున, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమని ప్రవచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. అన్ని కులాలు, మతాలకు రాజ్యాంగ భద్రత కల్పించిన అంబేద్కర్కు సమున్నత గౌరవం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రూ.150 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దళితబంధు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్తో దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కుల వృత్తిదారులకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉత్తమ్పద్మావతి దంపతులు ఓటమి పాలై రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఇక్కడ పుట్టి, పెరుగని వారికి ఈ ప్రాంతంపై ఎందుకు మమకారం ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు దండుకునేందుకే ఇక్కడికి వలస వచ్చారని ఆరోపించారు. వారికి ఈ రెండు నియోజకవర్గాలను ఎవరో పట్టా రాసిచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నించారు. అందినకాడికి సంపాదించుకుని పలాయనం చిత్తగించేందుకే ఇక్కడికి వచ్చారన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువకపోతే గడ్డం తీస్తానన్న ఉత్తమ్ ఎందుకు మాట తప్పారని, అబద్దాలు ఆడటం ఆయన నైజమని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కోదాడలో మల్లయ్యయాదవ్, హుజూర్నగర్లో తాను గెలువడం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి కేఆసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందడంతోపాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్పొరేషన్ చైర్మన్, పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధిపై ప్రజలు సమీక్షించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని, కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ 50వేల మెజార్టీతో గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవని, నేడు రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమాతోపాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుతంత్రాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ బట్టబయలు చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనన్నారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నడుం బిగించాలని శ్రేణులకు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ మరింత బలోపేతమవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం నివ్వెరపోయే విధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. కోదాడ నియోజకవర్గానికి ఉత్తమ్పద్మావతి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. నాలుగేండ్లలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రూ.1950కోట్ల అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ప్రజల వెన్నంటి ఉండే నాయకుడికి పార్టీ శ్రేణులు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారు.
అరవై ఏండ్లలో ఆంధ్రా వలస పాలకులు చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించినందున ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్కే ఉన్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశ ముఖ చిత్రపటంలో సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోదాడ నియోజకవర్గంలో నాలుగేండ్లలో రూ.1950 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లు, కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.80 కోట్లు, మిషన్ భగీరథకు రూ.390 కోట్లు, చెక్ డ్యామ్ల నిర్మాణానికి రూ.21కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని మోతె, నడిగూడెం మండలాలకు గోదావరి జలాలు అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల హయాంలో సాగర్ ఆయకట్టు చివరి ప్రాంతమైన కోదాడకు సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని, ఇప్పుడు మూడు పంటలకు సాగునీరు లభించి రికార్డుకు మించి ధాన్యం పండుతున్నదని అన్నారు.