అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో
అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లో మగ్గాల్సిన రోజులు వస్తాయన్న మూర్ఖుల చెంప చెల్లుమనిపించేలా నిరంతర వెలుగులు నింపుతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందన్నారు. 2014కు ముందు కరంట్ సరిగ్గా ఇవ్వలేదని, పైగా నిర్దేశించిన సమయంలో కాకుండా విద్యుత్ను వాడుకుంటే రైస్ మిల్లులు, పలు వ్యాపార సంస్థలకు జరిమానా విధించారని, ఆ విషయాన్ని మిల్లర్లు ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. నాటికి, నేటికీ విద్యుత్ వాడకం 150 శాతానికి పెరిగిందని చెప్పారు. రైతుబంధు పథకం, నిరంతర విద్యుత్తో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతున్నదన్నారు. సమైక్య పాలకుల పాపాలకు మూతపడిన మిల్లులు మళ్లీ తెరుచుకోవాలని, అన్ని ప్రాంతాల్లో రైస్ ఇండస్ట్రీస్ పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని, అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడమే లక్ష్యంగా పోతున్నదని దుయ్యబట్టారు.
సూర్యాపేట టౌన్, మార్చి 17 : పోరాడి సాధించిన తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని, దేశంలోనే నంబర్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకు పోతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఇమ్మడి సోమనర్సయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గాల్సిన రోజులు వస్తాయన్న మూర్ఖుల చెంప చెల్లుమనిపించేలా నిరంతర వెలుగులు నింపుతూ దేశంలోనే విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తున్నదని ఆయన గర్వంగా చెప్పారు. కరెంట్ సరిగా అందివ్వకపోవడమే కాదు ఉన్న సమయంలో కరెంట్ వాడుకుంటే జరిమానా విధించిన దుర్మార్గమైన ప్రభుత్వాలను చూసిన మిల్లర్స్ నేడు సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా వ్యాపారాలు కొనసాగించు కుంటున్నారన్నారు. కాళేశ్వర జలాలతో పుష్కలంగా నీరు, నిరంతర విద్యుత్, రైతుబందు పథకాలతో తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగుతుం దన్నారు. గత ఉమ్మడి పాలకుల పాపాలకు మూతపడిన మిల్లులు మళ్లీ తెరుచుకోవాలని.. అన్ని ప్రాంతాల్లో రైస్ ఇండస్ట్రీస్ పెరిగేలా ప్రోత్సహి ంచాలన్నారు. ప్రధానంగా మిల్లర్లు రైతులకు సమయానికి డబ్బులు అందించాలని సూచించారు. ధాన్యం విషయంలో పంట వేసిన తరువాత దొడ్డు బియ్యం కొనమని కేంద్రం మధ్యలో చేతులెత్తేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచి చివరి గింజ వరకూ కొని ఆదుకున్న విషయం రైతులు ఎప్పటికీ మరిచిపోరన్నారు.
ఢిల్లీతో సహా అన్ని ప్రధాన నగరాల్లో విద్యుత్ కోతలున్నాయని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ 6 గంటలే కరెంట్ అందిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం కాదు ఆదానీ కోసమే నడుస్తుందన్నారు. మోదీ తన కుడి భుజంగా ఆదానీ.. ఎడమ భుజంగా అంబానీలను పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పేదలను మరింత పేదరికంలోకి నెడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థలతో పోల్చిన హీనులు దేశాన్ని పాలిస్తున్నారంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని మాట్లాడిన బీజేపీ నేతల తలరాతలను మార్చేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారన్నారు. ఏపీలో ప్రస్తుతం 16 ఎకరాల్లో పంట ఉంటే తెలంగాణలో మాత్రం 56 లక్షల ఎకరాలు పంట ఉందన్నారు. 2014 కు ముందు ఇంతటి అభివృద్ధి ఏమైందని ఆలోచిస్తే అప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుందన్నారు. అందుకే మన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటుందన్నారు. కార్యక్రమానికి ముందు చిన్నారుల నృత్యాలు అలరించాయి. అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి సోమనర్సయ్యను గజమాలతో సత్కరించారు. మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, బోనాల రవీందర్, అన్నమనేని సుధాకర్ రావు, బోయినపల్లి ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, అమరేందర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ స్నేహలత, నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, మొరిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.