రామగిరి, మార్చి 22 : నల్లగొండలోని ఇంటర్మీడియట్ మూల్యాంకనం కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సందర్శించారు. ప్రాధాన్యత ప్రకారం మూల్యాంకనం విధులను కేటాంపులు చేయలేదని, డీఐఈఓ దస్రూనాయక్ వ్యవహర శైలిపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా బాధ్యులు గురువారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు ఫిర్యాదు చేయడంతోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి అధికారులు వచ్చారు.
తొలుత వాల్యూయేషన్లో ఉన్న అధ్యాపకుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం క్యాంపు అధికారి, డీఐఈఓ కేటాయించిన సీఎస్, ఏఈ ఇతర విధుల్లో ఉన్న అధ్యాపకుల వివరాలు, సీనియారిటీ, బోర్డు నిబంధనల మేరకు ఉన్నాయా..? లేదా అనే విషయాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అదే విధంగా శుక్రవారం ప్రారంభమైన కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెకుల విధుల్లో హాజరు వివరాలు, సీనియారిటీ ప్రకారం ఇచ్చారా లేదా అని చూశారు.
ఈ క్రమంలో సందర్శనకు వచ్చిన బోర్డు అడిషనల్ డైరెక్టర్ చిత్రం యాదగిరి, శ్రీనివాస్ను ముట్టడి చేసే ప్రయత్నం చేయడంతో వారు నివేదికలను రాష్ట్ర కమిషనర్కు ఇస్తామని, ఆ తదుపరి బాధ్యులపై చర్యలు ఉంటాయని వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సందర్శనకు వచ్చిన అధికారులకు మూల్యాంకనంలో జరిగే తప్పులు, ఇతర వివరాలను నమోదు చేస్తూ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ బాధ్యులు వినతి పత్రం అందించినట్లు తెలిపారు.