తుంగతుర్తి, ఫిబ్రవరి 02 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన వ్యవసాయ రంగం, రైల్వే, విమానయాన, ఇలా పలు రంగాలకు నిధులు కేటాయించ లేదన్నారు. ప్రజలకు ఉపాధి కల్పనా రంగంలో కూడా సరియైన నిధులు కేటాయించడం బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి 8 మంది, బిజెపి నుండి 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే ఉత్సవ విగ్రహాల వలె పార్లమెంట్లో మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు తునికి సాయిలు గౌడ్, గోపగాని రమేష్, చింతకుంట్ల భాస్కర్, గోపగాని వెంకన్న పాల్గొన్నారు.