ఏ కారణంతోనైనా రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం చేపడుతున్నది. ఏటా ఒక్కో రైతుకు ప్రీమియం చెల్లించి పాలసీ అమలు చేస్తున్నది. 2023-24 సంవత్సరానికి నల్లగొండ జిల్లాలో ఒక్కో రైతుకు రూ.3,437 ప్రీమియం చొప్పున చెల్లించి 2,65,200 మందికి రెన్యువల్ చేసింది. కొత్తగా 23,531 మందిని బీమా పరిధిలోకి తెచ్చింది. దాంతో మొత్తం 2,88,731 మందికి బీమా వర్తించనున్నది. ప్రతి ఏటా ఆగస్టు13తో బీమా గడువు ముగియనుండగా ఆగస్టు 14 నుంచి కొత్తది అమల్లోకి వస్తుంది. రైతు ఒకవేళ మరణిస్తే బాధిత కుటుంబానికి ఇన్యూరెన్స్ కంపెనీ ద్వారా రూ.5లక్షలు అందనున్నాయి.
– నల్లగొండ, ఆగస్టు 13
భువనగిరి కలెక్టరేట్/ నల్లగొండ/ సూర్యాపేట, ఆగస్టు 13 : ఏదైనా కారణంతో రైతు మరణిస్తే ఆయనను నమ్ముకున్న కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది. ఆ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించి ఆర్థికంగా సుస్థిరత అందించేందుకే రైతు బీమా. ప్రతి రైతుకు ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వారికి రూ.5 లక్షల బీమా పథకాన్ని 2018-19 సంవత్సరం నుంచి ప్రారంభించింది. రైతు బీమా పరిధిలోకి వచ్చే రైతులు ఏ కారణంతోనైనా చనిపోతే వారం పది రోజుల్లోనే ఆ రైతుకు నామినీ ఖాతాల్లో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.5 లక్షలు జమ అవుతాయి. గతేడాది నల్లగొండ జిల్లాలో 2,65,200 మందికి ప్రీమియం చెల్లించిన సర్కార్ ఈ సారి కొత్తగా ఎన్రోల్ అయిన 23,531తో కలిపి మొత్తంగా 2,88,731 మందికి ప్రీమియం చెల్లించి కొత్తగా పాలసీ పరిధిలోకి తీసుకొచ్చింది.ఈ పథకం ప్రతి ఏటా సర్కార్ ఆగస్టు14న రెన్యువల్ చేస్తున్నది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా రెన్యువల్ చేస్తూ నిర్ణయం తీసుకోని ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి మరో ఏడాదికి పెంచింది.
సూర్యాపేటలో 1,58,875 మంది..
సూర్యాపేట జిల్లాలో రైతు బీమాకు 1,58,875 మంది రైతులు అర్హులుగా తేలారు. వారిలో గతంలో పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ బీమా కోసం దరఖాస్తు చేసుకోని వారు 4,109 మంది ఉండగా, కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు 7,033 మంది. మొత్తం కలిపి 11,142 మంది రైతులు కొత్తగా బీమా పరిధిలోకి వచ్చారు. అలాగే 1,47,733 మంది రైతులకు రెన్యువల్ అవుతుండగా మొత్తం 1,58,875 మంది రైతులు బీమా పరిధిలోకి వస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో అర్హులు 1,29,474 మంది..
ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో రైతు బీమాకు 1,29,474 మంది రైతులు అర్హులుగా తేలారు. వారిలో గతంలో పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ బీమా కోసం దరఖాస్తు చేసుకోని వారు 6,421 మంది ఉండగా, 1,15,921 మందికి రెన్యువల్ చేసింది. కొత్తగా 13,553 మందిని బీమా పరిధిలోకి తెచ్చింది. మొత్తం 1,29,474 మంది రైతులు బీమా పరిధిలోకి వస్తున్నారు. గత ఐదేళ్లలో బీమా పరిధిలోకి వచ్చిన రైతులతో పాటు ఈ ఏడాది బీమా పరిధిలోకి వచ్చే వారి వివరాలు ఇలా ఉన్నాయి.
స్పెషల్ డ్రైవ్లో పెరిగిన రైతుల సంఖ్య..
రాష్ట్రంలో ఎక్కడైనా కనీసం గుంట జాగా రైతు పేరుతో పట్టా అయి ఉండి కనీస వయసు 18 నుంచి 59 ఏండ్ల వరకు ఉంటే రైతు బీమా పథకం పరిధిలోకి వస్తారు. వారి నుంచి వ్యవసాయ అధికారులు పాస్ బుక్ వివరాలు తీసుకొని బాండ్ ఇచ్చి ఈ పథకం పరిధిలోకి వస్తారు. 2018-19 నుంచి ఈ పథకం కింద ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 2,65,200 మంది ఎన్రోల్ అయ్యారు.అయితే ప్రభుత్వం తాజాగా ఈ సీజన్లో ఈ ఏడాది జూన్ 18 వరకు కొత్త పాస్ బుక్లు తీసుకున్న వారు దరఖాస్తులు చేసుకుంటే రైతు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. దాంతో రైతు బీమా పథకం కోసం వ్యవసాయ శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో కొత్తగా జిల్లాలో 23,531 మంది రైతుల తమ పేర్లు నమోదు చేసుకున్నారు.