నల్లగొండ(నమస్తే తెలంగాణ), మే 31 : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏండ్ల అలుపెరగని పోరాటంతో, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని ఎగురవేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు.
పార్టీ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా జరపాలని తెలిపారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సర్కార్కు దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.