బొడ్రాయి బజార్, జనవరి 6 : నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడికి విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా నిలిచారు. సూర్యాపేటకు చెందిన షేక్ నజీర్పాషా జ్యూస్ బండి నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. కొంత కాలం క్రితం షుగర్ వ్యాధితో రెండు కాళ్లు కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నజీర్పాషాను మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శించి కృత్రిమ కాళ్ల ఏర్పాటుకు రూ. 3 లక్షల ఎల్ఓసీ అందించారు. కాళ్లు కోల్పోవడంతో కుటుంబం గడువడం ఇబ్బందిగా మారిందన్న విషయాన్ని గమనించిన మంత్రి జ్యూస్ షాపు ఏర్పాటుకు సహకరిస్తానని అదే సమయంలో హామీ ఇచ్చారు. గత నెల 3న నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో స్పెషల్ మినరల్ ఫండ్ ద్వారా రూ. 4.50 లక్షల చెక్కును అందజేసి ఆర్థ్ధికంగా నజీర్ కుటుంబానికి భరోసా కల్పించారు. అతడి కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు స్థానిక చర్చి కాంపౌండ్లో జ్యూస్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించారు. నజీర్ ఏర్పాటు చేసుకున్న జ్యూస్ షాపును శుక్రవారం మంత్రి ప్రారంభించారు. తానే స్వయంగా జ్యూస్ తయారు చేసి అందరికీ అందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి జగదీశ్ రెడ్డికి నజీర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ జ్యోతి, శ్రీవిద్య కరుణాకర్, రియాజ్, నయీమ్, నజీర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.