నేటి నుంచి ఈ నెల 26 వరకు నిర్వహించనున్న అధికారులు
తక్కువ ధరతో విలువైన ప్లాట్లను విక్రయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఏడాది మార్చిలో 165 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించిన యంత్రాంగం
ప్లాట్లకు రోడ్డు, నీటి సౌకర్యం ఏర్పాటు
నల్లగొండ, జూన్ 19 : శ్రీ వల్లి టౌన్ షిప్లో తక్కువ ధరలతోనే సామాన్యులకు ప్లాటు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి దఫాగా వేలం నిర్వహించిన అధికారులు మరోసారి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ రోడ్డులోని 12వ బెటాలియన్ సమీపంలో గల శ్రీవల్లి టౌన్ షిప్లో 253 ఓపెన్ ప్లాట్లు, 363 గృహాలకు సంబంధించి వేలం నిర్వహించనున్నారు. ఓపెన్ ప్లాట్లకు గజం రూ.7వేలు కాగా గృహాలకు రూ.7వేల నుంచి రూ.12,500 వరకు ఆయా దశలను బట్టి నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు నల్లగొండలోని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వేలం నిర్వహించనున్నారు. వేలం పాల్గొనే వారు రూ.10వేల డీడీని కలెక్టర్ పేరుతో తీయాలని అధికారులు సూచించారు.
అన్ని వసతులు ఏర్పాటు…
సాధారణంగా ఏర్పాటు చేసే వెంచర్లలో నిర్వాహకులు చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. ప్లాట్లు చేసినా.. ఇండ్లు నిర్మించినా వెంచర్లో డీటీసీపీతో పాటు అన్ని అనుమతులు తీసుకోవాలి. లేదంటే కొనుగోలు చేసిన వాళ్లకు కష్టాలే. కనీసం బ్యాంకు నుంచి రుణ సౌకర్యం కూడా రాదు. అయితే శ్రీవల్లి టౌన్ షిప్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నందున ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అనుమతులతో పాటు రోడ్ల నిర్మాణం, వీధి లైట్లు, ప్రతి ప్లాటుకు కులాయి సౌకర్యం, గార్డెనింగ్, పార్కు ఏర్పాటు చేసే విధంగా అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
తొలి విడుతలో 165 ప్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లు…
రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో ఓపెన్ ప్లాట్లు 240 ఉండగా ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బహిరంగ వేలంలో బిడ్డర్లు 165 ప్లాట్లను దక్కించుకున్నారు. ప్రారంభ ధర గజానికి రూ.7వేలు మాత్రమే ఉండగా బిడ్డర్లు పోటీకి వచ్చి గరిష్టంగా ప్లాటుకు రూ.13,700 వరకు పెట్టారు. 165 ప్లాట్లలో అన్ని ప్లాట్లు గజం రూ.7వేలకు పైగానే అమ్ముడుపోయాయి. ప్రభుత్వానికి రూ.31.79 కోట్ల ఆదాయం వచ్చింది. అదే నెలలో డబ్బులు చెల్లించిన వారికి ప్రభుత్వం రెండు శాతం రాయితీ కూడా ఇచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ రోడ్డులోని 12వ బెటాలియిన్ సమీపంలో శ్రీవల్లి టౌన్ షిప్ ఉండడం.. రోడ్డు పక్కనే అన్ని వనరులు కలిగి ఉండడంతో బిడ్డర్లు ప్లాట్ల కొనుగోలు విషయంలో ఆసక్తి చూపుతున్నారు.
నేటి నుంచి ఈనెల 26 వరకు భౌతిక వేలం
శ్రీ వల్లి టౌన్ షిప్లో 253 ఓపెన్ ప్లాట్లతో పాటు 363 గృహాలకు నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు బహిరంగ వేలం నిర్వహించనున్నాం. ఓపెన్ ప్లాట్లకు గజానికి రూ.7వేలు కాగా గృహాలకు ఆయా దశలను బట్టి రూ.7వేల నుంచి రూ.12,500 వరకు నిర్ణయించడం జరిగింది. ఆసక్తి గల వారు రూ.10వేల డీడీ కలెక్టర్ నల్లగొండ పేరుతో తీసుకొని వేలంలో పాల్గొనాలి.
– రాహుల్శర్మ, కలెక్టర్