యాదాద్రి భువనగిరి, మే 26 (నమస్తే తెలంగాణ) :ఇప్పటికే చిరు వ్యాపారాలతో ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్త్రీ నిధి రుణాలు ఇచ్చి వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నది. ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగేలా ఊతమిస్తున్నది. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేలా చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఆ మేరకు క్రిడెట్ ప్లాన్ రూపొందించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 362.85 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సారి కొత్తగా సోలార్ పవర్ యూనిట్లు కూడా మంజూరు చేసింది. జనవరి కల్లా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
యాదాద్రి జిల్లావ్యాప్తంగా 18,003 పొదుపు సంఘాలు ఉండగా 1.82లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఏటా సెర్ఫ్, మెప్మా ఆధ్వర్యంలో స్త్రీ నిధి రుణాలు ఇస్తున్నారు. స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. వివిధ రంగాల్లో చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా పరిపుష్టి పొందుతున్నారు. వందల రకాల యూనిట్ల ఏర్పాటు చేసుకుని స్వయంశక్తితో ముందుకెళ్తున్నారు. కిరాణా షాపు, ఫ్యాన్సీ దుకాణాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ప్లేట్ల తయారీ, జీరాక్స్ సెంటర్, జనరల్ మెడికల్ షాపు తదితర చిన్న చిన్న వ్యాపారాలు నడిపించుకుంటున్నారు. ఇలా నెలకు రూ.10నుంచి రూ. 20వేల దాకా ఆదాయం పొందుతూ ఆర్థికంగా మెరుగుపడుతున్నారు. స్త్రీ నిధి పథకంలో భాగంగా రుణాలతో పాటు సర్కారు బీమా సదుపాయం కల్పిస్తున్నది. రుణం తీసుకున్న సదరు మహిళ.. ప్రమాదవశాత్తు మరణిస్తే పథంక కింద తీసుకున్న రుణం మొత్తం మాఫీ అవుతుంది. అంతేగాక ఎన్ని కిస్తీలు కట్టారో అంత మొత్తం సైతం తిరిగి ఆమె కుటుంబానికి చెల్లిస్తారు.
ఉమ్మడి జిల్లాలో రుణాలు ఇలా..
యాదాద్రిభువనగిరి జిల్లాకు రూ.102 కోట్ల స్త్రీ నిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సెర్ఫ్ ద్వారా రూ.85కోట్లు, మెప్మా ద్వారా రూ.17కోట్లు ఇవ్వాలని టార్గెట్ నిర్దేశించారు. జిల్లాలో 300డెయిరీ యూనిట్లు, 600పౌల్ట్రీ యూనిట్లు, 30 గొర్రెల యూనిట్లు, 50 కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు, 30ఎలక్ట్రిక్ ఆటోలు, 30 హౌస్ రిపేర్ యూనిట్లు మంజూరయ్యాయి. నల్లగొండ జల్లాకు రూ.146కోట్లు లక్ష్యంగా పెట్టగా, సెర్ప్ ద్వారా 129 కోట్లు, మెప్మా ద్వారా 17కోట్లు టార్గెట్గా నిర్దేశించారు. సూర్యాపేటకు 114.85 కోట్లు లక్ష్యంగా పెట్టగా, ఇందులో మెప్మాద్వారా 31.85 కోట్లు, సెర్ప్ ద్వారా రూ. 83కోట్లు లక్ష్యంగా పెట్టారు.
ఈ ఏడాది నుంచి సోలార్కు కూడా..
స్త్రీ నిధి రుణాల్లో భాగంగా ఈ ఏడాది కొత్తగా సోలార్ విద్యుత్కు కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి కింద ఒక్కో యూనిట్కు రూ.లక్ష నుంచి రూ.1.25లక్షల రుణం ఇవ్వనుంది. ఐదేళ్ల కాల పరిమితిలో చెల్లించేలా అవకాశం కల్పించింది. 25ఏండ్ల పాటు ఉచిత విద్యుత్ను పొందడమే గాక ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి జల్లా వ్యాప్తంగా 1050 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు 350 చొప్పున యూనిట్లు మంజూరయ్యాయి.
జనవరి కల్లా లక్ష్యం పూర్తి
యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.102కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. ఏటా మార్చి వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలి. కానీ ఈ ఏడాది జనవరి కల్లా టార్గెట్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రళాళికలు సిద్ధం చేశాం. సిబ్బందితో సమావేశాలు నిర్వహించాం. ఈ ఏడాది కొత్తగా సోలార్ పవర్ ఉత్పత్తికి కూడా 350 యూనిట్లు మంజూరయ్యాయి.
– నాగిరెడ్డి, ఇన్చార్జి, డీఆర్డీఓ