యాదగిరిగుట్ట, ఫిబ్రవరి18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాలను సోమవారం ఉదయం10 గంటలకు స్వస్తి వాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు అంకురారోపణం, మృత్స్యంగ్రహణం చేపడుతారు. 20న ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, హోమం, వేద పారాయణం, సాయంత్రం 6 గంటలకు దేవతాహ్వానం, భేరీపూజ నిర్వహిస్తారు. 21న ఉదయం 10 గంటలకు హవనం, సింహవాహన అలంకార సేవ, సాయంత్రం 6 గంటలకు హోమం, అశ్వవాహన అలంకార సేవ, అనంతరం ఎదుర్కోలు మహోత్సవం చేపడుతారు.
22న ఉదయం 10 గంటలకు తిరుమంజనం, హనుమంత వాహన అలంకార సేవ, 6 గంటలకు హోమం, రాత్రి 8 గంటలకు గజవాహన అలంకార సేవ, తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 23న 10 గంటలకు గరుఢ వాహన అలంకార సేవ, 6 గంటలకు రథాంగ హోమం, 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరిపిస్తారు. 24న 10 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవం నిర్వహిస్తా రు. 25న ఉదయం 10 గంటలకు అష్టోత్తర శత ఘటాభిషేకం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహదాశీర్వచనం, పండిత సన్మానం చే పట్టి ఉత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు.
స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు కల్యాణ టికెట్టు రూ. 600 నిర్ణయించినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. శత ఘటాభిషేకంలో పా ల్గొనే భక్తులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుందని, ఒక టికెట్పై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పాతగుట్టలో నిత్య కల్యాణం, మొక్కు కల్యాణం, హోమాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. 23న రథోత్సవం సందర్భంగా రాత్రి ఆర్జిత సేవలు, అర్చనలు, శతనామార్చనలు, బోగాలు, 24న చక్రతీర్థం సందర్భంగా అభిషేకం, అర్చనలు, 25న అష్టోత్తర శత ఘటాభిషేకం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు రద్దు చేస్తున్నామని తెలిపారు.