కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. పార్టీ పెద్దల తీరు నచ్చక, డబ్బుంటేనే టికెట్లు అన్న ధోరణితో విసిగి, కార్పొరేట్ సంస్థలా మారిన పార్టీలో ఇమడలేక పోతున్నానంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీకి పంపారు. రాజీనామా విషయం తెలిసిన మంత్రి జగదీశ్రెడ్డి పాల్వాయి స్రవంతి ఇంటికెళ్లి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన స్రవంతి ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. స్రవంతి నిర్ణయంతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినైట్లెంది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్11(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్లోకి వలస పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక నేతలు ఆయా నియోజకవర్గాల వారీగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం డబ్బుతో కూడుకున్నది కావడంతో ఏండ్ల తరబడి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నేతలంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దల వైఖరితో విసిగిన నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బీఆర్ఎస్లో చేరుతున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, ఆది నుంచి గాంధీ కుటుంబానికి విధేయులుగా కొనసాగుతున్న పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుటుంబానికి చివరకు ఇబ్బందులు తప్పలేదు. దాంతో గోవర్ధన్రెడ్డి కూతురు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి పార్టీలో నేతల తీరు నచ్చక, పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
గత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మధ్యలోనే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సైతం పార్టీ పెద్దల సూచన మేరకు ఉప ఎన్నికల్లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల నడుమ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పార్టీ పరువు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించి పార్టీ పట్ల తమ కుటుంబానికి ఉన్న విధేయతను చాటుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికల్లో టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతిని కాదని తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రాజగోపాల్రెడ్డికి టికెట్టు కేటాయించడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపింది.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, పార్టీ నేతలను బండబూతులు తిట్టిన రాజగోపాల్రెడ్డి 10 నెలల్లోనే పార్టీకి ఎలా మంచి వాడయ్యాడన్నది సందేహాస్పదంగా మారింది. కేవలం డబ్బుంటేనే టికెట్టు అన్న పరిస్థితులను పార్టీలో తెచ్చిపెట్టారని, పార్టీ కోసం అహార్నిశలు కష్టపడ్డవారికి మొండిచేయి చూపడం నిజాయితీ కల నేతలను తీవ్రంగా కలిచివేసింది. పాల్వాయి స్రవంతి సైతం రాజగోపాల్రెడ్డికి టికెట్ కేటాయించడానికి జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆమె అనుచరులు, పాల్వా యి కుటుంబ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తీవ్ర ఆవేదన స్వరంతో పాల్వాయి స్రవంతి ప్రకటించారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీకి రాజీనామా లేఖను పంపుతూ పార్టీని వీడాల్సిన అనివార్య పరిస్థితులను అందులో స్పష్టం చేశారు.
పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిన బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పందించారు. హైదరాబాద్లోని పాల్వాయి స్రవంతి ఇంటికెళ్లి మంత్రి జగదీశ్రెడ్డి పలకరించారు. నల్లగొండ జిల్లాతో పాటు మునుగోడు అభివృద్ధ్ది కోసం బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు. పని చేస్తున్న పార్టీ పట్ల పూర్తి విధేయతతో ఉండే పాల్వాయి కుటుంబం నుంచి వచ్చిన స్రవంతికి బీఆర్ఎస్లో సముచిత స్థానం ఉంటుందన్న భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాల్వాయి స్రవంతి అనుచరులు, అభిమానులతో చర్చించాక కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధ్దమయ్యారు. ఇదే విషయాన్ని శనివారం వెల్లడించారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు పాల్వాయి స్రవంతి ప్రకటించారు. నేడు దీపావళి కావడంతో కేవలం ముఖ్య అనుచరులతోనే పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.