ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో ఆదివారం ధ్యాన తరగతులను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. మహాస్తూపం మొదటి అంతస్తులో నాలుగు బ్యాచ్లకు 30 నిమిషాల చొప్పున ధ్యానం నిర్వహించారు. విపశ్యన గురువు సత్యనారాయణ గోయెంకా సందేశాలు, సూచనలతో పలువురు ధ్యానం ఆచరించారు. క్రమశిక్షణ, నిశ్శబ్దంతో సాగిన తరగతులు మనస్సుకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చాయని పలువురు పేర్కొన్నారు.
నందికొండ, జూన్ 19 : నల్లగొండ జిల్లా నందికొండలోని ఆసియాలోనే అతి పెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో ఆదివారం ధ్యాన తరగతులు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. బుద్ధవనంలోని మహాస్తూపం మొదటి అంతస్తులో మధ్యాహ్నం 12నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 4నుంచి 5 గంటల వరకు ఒక్కో బ్యాచ్కు 30 నిమిషాల చొప్పున 4 బ్యాచ్లకు దమ్మ నాగార్జున, విపశ్యన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యాన తరగతులు నిర్వహించారు. విపశ్యన గురువు సత్యనారాయణ గోయెంకా సందేశాలు, సూచనలతో అభ్యర్థులు ధ్యానం ఆచరించారు. ఒక్కో బ్యాచ్లో 70 మంది చొప్పున శిక్షణ పొందారు. ధ్యాన తరగతులకు తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. క్రమశిక్షణతో సాగిన ధ్యాన తరగతులు ఎంతగానో ఉత్సాహం, ఆనందాన్నిచ్చాయని ధ్యానులు తెలిపారు. ప్రతి ఆదివారం బుద్ధవనంలోని మహాస్తూపంలో ధ్యాన తరగతులు జరుగుతాయని, తరగతులకు చిన్న పిల్లలకు అనుమతి లేదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, పురావస్తు, బౌద్ధ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులతో బుద్ధవనం నిపుణుడు శివనాగిరెడ్డి
పర్యాటకుల సందడి
నందికొండలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. బుద్ధవనం, లాంచీ స్టేషన్ల వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో సందడి నెలకొంది. బుద్ధవనాన్ని పర్యాటకులు సందర్శించి బుద్ధచరితవనం, మహాస్తూపం, ధ్యాన మదిరం, అవకానను తిలకించారు. కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన జాలీ ట్రిప్పు, నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చారు. బుద్ధవనం నిపుణుడు ఈమణి శివనాగిరెడ్డి బుద్ధవనం చరిత్రను వారికి వివరించారు.