పోతరాజుల విన్యాసాలు.. లయాత్మకంగా ఒగ్గు డోలు, తాళాల ధ్వనులు.. మహిళల కోలాటాలు.. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు.. నెత్తిన బోనాలు.. రంగురంగుల బతుకమ్మలు.. డప్పుల మోత.. అసైదులా హారతి అంటూ పీర్లు.. డీజే చప్పుళ్లతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడింది. సంస్థాన్ నారాయణపురంలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాల్లో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రజలతో మమేకమై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు డ్యాన్స్ చేసి ఉత్సాహ పరిచారు. 12 వేల మందికిపైగా తరలిరావడంతో నారాయణపురం సందడిగా మారింది.
తెలంగాణపై బీజేపీ అక్కసు వెల్లగక్కుతున్నదని, మునుగోడు ప్రజలంతా ఏకతాటిపై ఉండి కాషాయ పార్టీ కుట్రలను ఎండగట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజనానికి మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే నంబర్ వన్గా నిలిచాయన్నారు. 20ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ పరిస్థితులు బాగాలేవని, ఇంకా పింఛన్ రూ. 600 దాటలేదని అన్నారు. తెలంగాణలో ప్రజలకు పింఛన్లు, రైతుబంధు, ఎందుకు ఇస్తున్నారని కేంద్రం పెద్దలు ప్రశ్నిస్తున్నారని, రాష్ర్టానికి రావాల్సిన నిధులను కూడా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు ఎందుకు పెట్టడం లేదని రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదమే ముఖ్యమంత్రి కేసీఆర్ బలమన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరు అని, ఆత్మీయ సమ్మేళనాలు, వన భోజనాలు అందులో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీపై పోరుకు మునుగోడులో 70 వేల మంది గులాబీ దండు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక్కడ కాషాయ పార్టీ కుట్రలకు తావులేదని తేల్చిచెప్పారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. పండుగలా జరుగుతున్న కార్యక్రమాలతో గులాబీ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ధూంధాం ఆటలు, తెలంగాణ వంటకాలు, సామూహిక భోజనాలు, ఆత్మీయ పలుకరింపులు, ఆలింగనాలు జనాన్ని కట్టిపడేస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే టీఆర్ఎస్ పండుగకు వస్తున్నాయి. గురువారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోనూ ఇదే సీన్ కనిపించింది. జనంతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మమేకమై, వారితోనే కలిసి నడుస్తున్నారు. అడుగులో అడుగేసి ఉత్సాహపరుస్తున్నారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.
అదరగొట్టిన ఆట సందీప్ టీమ్..
ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఏర్పాట్లు చేసిన కార్యక్రమాలు అలరించాయి. జానపద కళాకారులు మొదలుకొని వెస్టర్న్ సాంగ్స్తో అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డ్యాన్సర్ ఆట సందీప్ టీమ్ చేసిన ప్రదర్శన ఆలోచింపజేసింది. మోడర్న్ డ్యాన్స్తోనే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న అద్భుత పథకాలను ఎంతో చక్కగా వివరించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కంటివెలుగు పథకాలను జనాలకు అర్థమయ్యేలా చూపించారు. అంతకుముందు సత్యనారాయణ సింగ్ టీమ్ చేసిన పేరిణి నృత్యం మంత్రముగ్దుల్ని చేసింది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని నాయీ బ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోళ్ల శివశంకర్, నారబోయిన రవి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, జిల్లా నాయకులు గుత్తా ప్రేమ్చందర్రెడ్డి, మన్నె ఇంద్రసేనారెడ్డి, శివరాత్రి సాగర్, గోవర్ధన్రెడ్డి, వీరమళ్ల వెంకటేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు lల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్
టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆత్మీయ సమ్మేళం, వన భోజనాలు ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. పట్టణంలో ర్యాలీ మొదలుకొని వేదికపై కార్యక్రమం ముగిసే వరకు అంతా దగ్గరుండి చూసుకున్నారు. ర్యాలీలో కర్రసాము చేసి అందరినీ అబ్బురపరిచారు. వేదికపై కళాకారులు, డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేశారు. తనదైన రీతిలో స్టెప్పులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కూడా డ్యాన్స్ వేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సైతం మహిళలతో కలిసి కోలాటం ఆడారు. లంబాడీ మహిళలతో కలిసి నృత్యం చేశారు.
ఊళ్లకు ఊళ్లు బైలెల్లాయి..
ఆత్మీయ సమ్మేళానికి ఊళ్లకు ఊళ్లే బైలెల్లుతున్నాయి. జనం స్వచ్ఛందంగా కార్యక్రమానికి తరలి వస్తున్నారు. బతుకమ్మలు, బోనాలతో మహిళలు, యువతులు భారీగా రావడం విశేషం. తండాల్లోని గిరిజనులు సైతం గులాబీ పార్టీకి జై కొట్టారు. వచ్చినోళ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఉల్లాసంగా గడిపారు. సుమారు 10వేల మంది కార్యక్రమానికి తరలివచ్చినట్లు అంచనా వేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు భయం పట్టుకుంది.
నారాయణపురంలోనే 45వేల పింఛన్లు..
సమైక్య రాష్ట్రంలో పింఛన్ రూ.200 మాత్రమే ఉండేదని, ఇప్పుడు రూ.2016కి పెరిగిందన్నారు. ఒక్క నారాయణపురం మండలంలోనే రూ.150 కోట్ల రైతు బంధు డబ్బులు అందాయని, 45వేల పింఛన్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. మునుగోడులో ముమ్మాటికీ కారు పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.