యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 24 : జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి మించి ప్రయాణించకూడదని పోలీసులు ప్రచారాలు చేస్తున్నా వాహనదారుల్లో ఎలాంటి మార్పూ రావడం లేదు. రోడ్లపై అతి వేగంతో యథేచ్ఛగా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రోడ్డుప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో వాహనదారుల వేగానికి కళ్లెం వేయాలని ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై లేజర్ స్పీడ్గన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి జాతీయ రహదారిపై ప్రయాణం ప్రారంభిస్తే అయిపోయే వరకు స్పీడ్గన్స్ కనిపెడుతూనే ఉంటాయి. వాహన వేగాన్ని అనుక్షణం స్పీడ్గన్లు గమనిస్తూనే ఉంటాయి. పరిధి దాటి వేగం అందుకుంటే వెంటనే మొబైల్ ఫోన్ లేదా ఇంటికి వాహన నంబర్ ఆధారంగా మీరు ఎంత వేగంతో వెళ్లారు. ఎంత జరిమానా కట్టాలి అనే సమాచారం వస్తుంది.
హైవేలపై రద్దీ…
వరంగల్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారులపై రాత్రింబవళ్లు వాహనాల రద్దీ ఉంటుంది. హైవేలపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి విశాలంగా ఉండడంతో వాహనాదారులు నిర్ణీత వేగాన్ని దాటి ప్రయణిస్తు న్నారు. ముఖ్యంగా భువనగిరి, ఆలేరు పట్టణాల్లో బైపాస్లు ఉండడం, చౌటుప్పల్ ఏరియాలో రోడ్లు విశాలంగా ఉండడంతో మీతిమీరిన వేగంతో కొంతమంది వాహనాదారులు ప్రయణిస్తున్నారు. దాంతో ఎక్కడో ఓచోట ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగంతోపాటు వాహనదారులు నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కూడా ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.
వాహనదారుల నిర్లక్ష్యం..
హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కొంత మంది పట్టించుకోవడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు నిత్యం రాయిగిరి, వంగపల్లి, ఆలేరు, భువనగిరి, బీబీనగర్ టోల్గేట్, చౌటుప్పల్ టౌన్, పంతంగి టోల్గేట్ల వంటి ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దాంతో కొంత మందిలో మార్పు వచ్చినప్పటికీ మరికొందరిలో రావడం లేదు. వేగానికి కళ్లెం వేసేందుకు జాతీయ రహాదారిపై పలు చోట్ల వాహనాల వేగాన్ని తెలియజేసే ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. వేగాన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు లేజర్ స్పీడ్గన్స్ ఉపయోగిస్తున్నారు. నిత్యం ఒక పోలీస్ ఉద్యోగి హైవేపై వాహనాల వేగాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడూ సూచించిన వేగం కంటే ఎక్కువగా వెళ్తే వాటిని ఫొటోలు తీస్తుంటారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు ఏ వాహనమైనా నిర్ణీత వేగం దాటితే వెంటనే ఈ స్పీడ్గన్లు పసిగడతాయి.
ఎనిమిది నెలల్లో 44,918 కేసులు..
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి ట్రాఫిక్ పోలీస్స్టేషన్, విజయవాడ-హైదరాబాద్ హైవేపై చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లోని పరిధిలో జనవరి నెల నుంచి ఇప్పటివరకు 8 నెలల్లో 44,198 కేసులు నమోదయ్యాయాంటే వాహనదారులు ఎలా ప్రయాణిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఇందులో భువనగిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 21,946 కేసులు నమోదవగా రూ. 2,27,25,010 జరిమానా, చౌటుప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 22,972 కేసులు నమోదవగా రూ. 2,35,45,220 జరిమానా విధించారు. గరిష్ట వేగం కంటే వెళ్లే ప్రతి వాహనానికి రూ. 1,035 ఫైన్ వేస్తున్నారు.
స్పీడ్ కంట్రోల్తోనే ప్రమాదాలకు చెక్..
రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలన్నా.. మరణాల రేటు తగ్గించాలన్నా ప్రధానంగా ఓవర్ స్పీడ్ను కంట్రోల్ చేయడం తప్ప వేరే మార్గం లేదని పోలీసులు భావిస్తున్నారు. దాంతో పాటు వాహనదారుల్లో చైతన్యం పెరగాలని, వేగం పెంచే క్రమంలో ఒక్క సారి కుటుంబం గురించి ఆలోచించాలని సూచిస్తు న్నారు. ఒక వాహనం ప్రమాదానికి గురయితే వారితో పాటు ఎదుటి వాహనంలోని వ్యక్తుల కుటుంబాలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతాయని గుర్తించాలి. వాహనదారులు తప్పనిసరిగ్గా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రయాణిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉన్నది.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖ తీసుకునే ప్రతి చర్య ఒక వ్యక్తి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచాలనే ఆకాంక్షతోనే తీసుకుంటున్నాం. అయినప్పటికీ వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పాటిస్తే చాల వరకు ప్రమాదాలకు చెక్ పడినట్లే. ఎక్కువ ప్రమాదాలు అతి వేగం, నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడాకి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి.
-సైదులు, ట్రాఫిక్ ఏసీపీ,యాదాద్రిభువనగిరి జోన్