విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఏర్పాటైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ సకల సౌకర్యాలతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. అన్ని డిపార్ట్మెంట్స్లలో నాణ్యమైన విద్య అందుతున్నది. మరోవైపు
పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చి ఎంతో మంది యువత భవితకు బాటలు వేస్తున్నది. 2007లో కొలువుదీరిన యూనివర్సిటీలో అంచెలంచెలుగా వివిధ కోర్సులను అందుబాటులోకి రాగా పీహెచ్డీలకు కేంద్రంగా మారింది.
ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో 17 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టా పొందారు. ఇక్కడ డాక్టరేట్ పొందిన వారు ఎన్నో ఉన్నత అవకాశాలను పొందుతున్నారు. గత సంవత్సరం పీహెచ్డీ పూర్తి చేసిన నల్లగొండ జిల్లా పాములగుండ్ల వాసి ఎం.జాన్పాల్కు కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం లభించింది. దాంతో యూనివర్సిటీ ఖ్యాతి ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర రాష్ర్టాలకు చేరింది. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వేస్తుండడం, గైడ్లు అందుబాటులో ఉండడంతో పీహెచ్డీ అడ్మిషన్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీలో 138 మంది పరిశోధన విద్యార్థులు ఉన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో 2007లో కొలువు దీరిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ అంచలంచెలుగా వివిధ కోర్సులు, వసతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తూ విద్యా ప్రగతిలో దూసుకెళ్తున్నది. నేటి కాలానికి అనుగుణంగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ జారీచేస్తూ వివిధ సబ్జెక్టుల్లో పరిశోధనలకు నిలయంగా మారింది. దాంతో నెట్, సెట్, జేఆర్ఎఫ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఎంజీయూలో పీహెచ్డీలో చేరుతున్నారు.
నిర్ణీత సమయంలో, గైడ్స్ పర్యవేక్షణలో పరిశోధనా పత్రాలను ఆయా విభాగాలకు సమర్పిస్తుండడంతో నిపుణుల కమిటీ ఆమోదంతో పీహెచ్డీ(డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ)ని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించడం గమనార్హం. అలాగే వివిధ డిపార్ట్మెంట్లలో ఇంకా 138 మంది పరిశోధన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
విద్యా ప్రమాణాల కోసం నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపులో యూనివర్సిటీలోని పరిశోధనలు, పీహెచ్డీ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రధాన గుర్తింపు ఉంటుంది. అయితే ఎంజీయూలో పీహెచ్డీ అవార్డులను అందించడంతో ఈ విద్యా సంవత్సరంలో న్యాక్ బృందం తనిఖీల్లో ప్రత్యేక మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న న్యాక్ హోదా బీ+కు పెరిగింది. దాంతో పరిశోధన విద్యార్థులకు మర్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
నేను ఎంజీయూలోని కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ కె.శ్రీదేవి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేశాను. 2018 నుంచి నా పరిశోధనలు సాగాయి. పరిశోధనలు పూర్తి చేసేలా గైడ్స్ నిత్యం అందుబాటులో ఉంటూ పలు సూచనలు, సలహాలు ఇస్తూ బాటలు వేస్తున్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను జనవరి 2023లో పరిశోధన గ్రంథాన్ని సమర్పించగా వైవా అనంతరం జూన్ 2023లో పీహెచ్డీ అవార్డు ప్రకటించారు. నవంబర్ 8, 2023లో జరిగిన వర్సిటీ కాన్వకేషన్లో గవర్నర్ తమిళిసై, వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి చేతులమీదుగా పీహెచ్డీ పట్టా అందుకోవడం సంతోషంగా ఉంది. కాగా, నా ప్రతిభను గుర్తించిన ఎంజీయూ అధికారులు ఇదే విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా అవకాశం కల్పించడంతో ఆర్థికంగా స్థిరపడ్డాను. నాకు ఉన్నత విద్య అందించిన వర్సిటీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా.
-కొతనోజు రవిచంద్ర, గెస్ట్ ఫ్యాకల్టీ
నల్లగొండ జిల్లా కట్ట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు నిన్నెకంటి రాయన్న రెండో కుమారుడే నిన్నెకంటి జాన్పాల్. తల్లిదండ్రుల కష్టం చూసిన జాన్పాల్ చదువులో ఉత్తమ ప్రతిభతో రాణించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6నుంచి 10వ తరగతి వరకు పోప్పాల్ పాఠశాల చిన్నాపురం, నూజివీడులోని సెంయిట్ఆన్స్లో ఇంటర్మీడియట్, మద్రాస్లోని లయోలా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పీజీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. 2009లో ఎంజీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు.
అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తూ తన ప్రతిభా నైపుణ్యాలతో నెట్, సెట్ అర్హత సాధించడంతో 2017లో ఎంజీయూ వెల్లడించిన పీహెచ్డీ నోటిఫికేషన్స్కు దరఖాస్తు చేసి సీటు పొందారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మెనేజ్మెంట్ ప్రొఫెసర్ డా॥ అల్వాల రవి పర్యవేక్షణలో ఫిబ్రవరి 8, 2018 నుంచి (Marketing Strategies for implementation of Digital Economy A study with reference to select sectors in Telangana State) అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించడంతో మార్చి 5, 2022లో పీహెచ్డీ వైవా ప్రజెంటేషన్ నిర్వహించగా మార్చి 7న డాక్టరేట్ అవార్డు ప్రకటిస్తూ ఎంజీయూ పరీక్షల విభాగం సీఓఈ డా॥ మిర్యాల రమేశ్ ఉత్తర్వులు జారీచేశారు.
దాంతో వర్సిటీ చరిత్రలోనే బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో తొలి డాక్టరేట్ సాధించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. కాగా నవంబర్ 8, 2023లో జరిగిన ఎంజీయూ మూడో కాన్వకేషన్లో గవర్నర్, వర్సిటీ ఛాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా తొలి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ సాధించిన జాన్పాల్ కేరళలోని సెంట్రల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసి 4 జూలై, 2022లో ఉద్యోగం సాధించి అక్కడే పని చేస్తున్నారు.
కాలానికి అనుగుణంగా నూతన మార్పులు తీసుకొచ్చేలా పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలకు దీటుగా ఎంజీయూలో 8 డిపార్ట్మెంట్లలో పీహెచ్డీ నోటిఫికేషన్స్ జారీచేసి నెట్, సెట్ అర్హత సాధించిన వారి మెరిట్, క్వాలిఫికేషన్స్ పరిగణలోకి తీసుకుని అడ్మిషన్లు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 17 మంది డాక్టరేట్ పొందగా మరికొంత మంది తమ పరిశోధన గ్రంథాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే పాలకమండలి నిర్ణయంతో పీహెచ్డీ అడ్మిషన్స్ కోసం మరో నోఫికేటిఫికేన్ జారీచేస్తాం. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి.
-ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, వీసీ, ఎంజీయూ
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు దీటుగా పరిశోధనలకు అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఎంజీయూలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నాం. వీసీ, రిజిస్ట్రార్ సూచనలతో అందించే నోటిఫికేషన్స్తో ఇంకా 138 మంది విద్యార్థులు తమ పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు పర్యవేక్షకుల సూచనలతో రెగ్యులర్, పార్ట్టైమ్లో కొనసాగుతున్నారు. ఎక్కడ రాజీలేకుండా నాణ్యతా ప్రమాణాలతో పరిశోధనలు సాగేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.
– డా॥ ఆకుల రవి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఎంజీయూ