మోతె/ నడిగూడెం, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాలం తెచ్చిన కరువు కాదిది.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రైతు పొలాలకు నీళ్లు తెస్తే.. కాంగ్రెస్ సర్కారు వచ్చి రైతుల కళ్లలో నీళ్లు తెచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మోతె మండలానికి కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు నీరు అందించి సస్యశ్యామలం చేశామని చెప్పారు.
ఎవరికి వేసిన ఓటు మంచి చేసిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ వాళ్లను ముళ్లుకర్రతో గుచ్చి అనగపెట్టి పని చేయించుకోవాలని, లేకుంటే వాళ్లకు పని చేసే చేతకాదని అన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అంటే నమ్మి ఓటేస్తే రైతు బంధు ఇవ్వలేదని, ఎకరాకు రూ.15వేలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామని చెప్పి ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాలేజీ విద్యార్థినులకు డిసెంబర్ 9న ప్రియాంకగాంధీ లక్ష స్కూటీలు ఇస్తామని చెప్పారు.. వచ్చాయా? అని అక్కడి ప్రజలను ప్రశ్నించారు. ఆటో కార్మికులకు రూ.12వేలు ఇస్తామని చెప్పి బువ్వకు కూడా లేకుండా చేశారని ఆరోపించారు.
రూ.4వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ముసలోల్లను కూడా మోసం చేశారని అన్నారు. కాళేశ్వరం జలాలతో రైతులకు నీరు అందించి ఆదుకున్నామని, ఉత్తమ్కుమార్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి ఇక్కడి పొలాలను ఎండబెట్టారని తెలిపారు. ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రిగా అందించిన బహుమానం 12నుంచి 14లక్షల ఎకరాలు ఎండబెట్టడమేనని ఎద్దేవా చేశారు.
అదే కేసీఆర్ గెలిచి ఉంటే ఈ రోజు మన నీళ్లు మనకు వచ్చేవని.. మన సంక్షేమ నిధులు మనకు అందేవని అన్నారు. బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని, కారు గుర్తుకు ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీపీ యాతాకుల జ్యోతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు శీలం సైదులు, నర్సిరెడ్డి, నాయకులు చంద్రయ్య, ఆంజనేయులు, మహేశ్, ఖలీల్ అహ్మద్, మధుసూదన్రెడ్డి, లింగారెడ్డి, వెంకటేశ్వర్రావు, సతీశ్, మల్సూర్, ముత్తయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.