నల్లగొండ, జనవరి 9 : గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ఆయా శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నరేందర్రెడ్డి అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ జడ్పీలో సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడంతోపాటు వాటిని పరిష్కరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికారులు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటేనే చట్ట సభలు, సర్వసభ్య వేదికలపై నమ్మకం ఉంటుందన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు ఒరిజినల్ ఆధార్ కార్డు కాకుండా జిరాక్స్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేకుంటే వారికి ప్రత్యేక కార్డులు అందజేయాలని, పల్లెలకు బస్సులు నడుపాలని అన్నారు. ఎక్స్ప్రెస్ సర్వీసులు మండల కేంద్రాల్లోనే ఆపడం వల్ల సమీప గ్రామాల్లో దిగేవారు ఇబ్బంది పడుతున్నారని, రాత్రి పూట ప్రయాణికులు అపమన్న చోట ఆపేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు.
మునుగోడులో బెల్ట్ షాపులు బంద్ కాలేదు..
మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్షాపులు బంద్ చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పినా అన్ని చోట్లా బంద్ కాలేదని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నాంపల్లిలో రోడ్ల పనులు నాణ్యంగా వేయడం లేదని, తిప్పర్తిలో ట్రాన్స్ఫార్మర్ల బిగింపులో ఆలస్యం జరుగుతున్నదని, మండల కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేరని ఆయా మండలాల జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని కొందరు సభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత మూడో స్థాయీ సంఘం సమావేశం జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అధ్యక్షతన, ఐదో స్థాయీ సంఘం సమావేశం ఆ స్థాయీ సంఘం చైర్మన్ కంకణాల ప్రవీణారెడ్డి అధ్యక్షతన జరిగాయి. సమావేశాల్లో డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.