– నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నీలగిరి, మే 21 : కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, తల్లిదండ్రులు కూడా అందుకు తగ్గట్లుగా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్’లో భాగంగా 15–18 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక ఆరోగ్య స్క్రీనింగ్ శిబిరాన్ని గురువారం పానగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార దశలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్లో అనేక వ్యాధులను నివారించవచ్చన్నారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం, నెలసరి పరిశుభ్రత వంటి అంశాలపై ప్రతి బాలికకు అవగాహన అవసరమని తెలిపారు. వైద్యులు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు.

‘కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలి’
మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర మాట్లాడుతూ.. 15–18 సంవత్సరాల వయస్సు గల బాలికలలో హార్మోన్ల మార్పుల కారణంగా శారీరక, మానసిక సమస్యలు సాధారణమని తెలిపారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తోందని, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్ సాధ్యమవుతుందని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తబస్సుం మాట్లాడుతూ.. కౌమార దశలో ఋతుస్రావ సమస్యలు, మొటిమలు, బలహీనత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. సరైన పోషకాహారం, పరిశుభ్రత, వైద్య సలహాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. అదేవిధంగా కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే శారీరక, మానసిక, పోషకాహార సంబంధిత సమస్యలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.

‘కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలి’
ఈ శిబిరంలో రక్తహీనత, మధుమేహం, బీఎంఐ పరీక్షలతో పాటు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కార్పొరేటర్లు పేర్ల మల్లేశ్వరి, ఆలకుంట్ల ఝాన్సీ, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, సిఓలు అనిల్ కుమార్, జ్యోతి, రాజా, నరసింహ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆర్పీలు పాల్గొన్నారు. మొత్తం 89 మంది కౌమార బాలికలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.