కేతేపల్లి, మే 20 : గుర్తు తెలియని కొందరు వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన వాహనాలు దగ్ధమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. తీవ్రమైన ఎండకు తోడు గాలి కూడా వీచడంతో వరి కొయ్యలు కాలుకుంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వ్యాపించాయి. విషయం గమనించిన పోలీసులు అప్రమత్తమై స్థానికుల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయత్నం ఫలించలేదు.
చూస్తుండగానే మంటలు ఎగిసి పడుతూ సీజ్ చేసిన వాహనాలకు అంటుకున్నాయి. పోలీసులు నకిరేకల్ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సాయంతో మంటలను ఆర్పి వేశారు.అప్పటికే మంటలు భారీగా వ్యాపించడంతో సీజ్ చేసిన సుమారు 25 బైక్లు, 3 కార్లు, ఓ లారీ, ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ధాటిగా ఎగిసి పడటంతో స్థానికులు, పోలీసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.