సూర్యాపేట సిటీ, జూన్ 24 : జిల్లాలో శాంతిభద్రతలు, పౌరుల రక్షణే లక్ష్యంగా పని చేస్తానని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో నేరాలు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వాటి నివారణకు కృషి చేస్తామన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతామని, పెట్రోలింగ్ పటిష్టంగా చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల రక్షణ, అక్రమ కార్యకలాపాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా చూస్తామని, యువత నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పిస్తామని అన్నారు. అంతుకుముందు బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి అడ్మిన్ అదనపు ఎస్పీ ఎం.నాగేశ్వర్రావు, ఆర్మ్డ్ అదనపు ఎస్పీ ఆర్.జనార్దన్రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్రెడ్డి, మట్టయ్య, శ్రీనివాస్రావు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు గౌరవ వందనం చేసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు పోలీసు సేవలపై పలు సూచనలు చేశారు. సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విజువల్ పోలీసింగ్ స్నేహపూర్వకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులు, బాధితులకు భరోసా కల్పించాలన్నారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్ షట్స్ ఉన్న వారి కదలికలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు. పెట్రోలింగ్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఆంధ్రాకు సరిహద్దుగా ఉన్నందున నిఘా కట్టుదిట్టంగా ఉండాలని, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చూడాలని సూచించారు. గంజాయి వినియోగం, సరఫరా లేకుండా క్షేత్ర స్థాయిలో నిర్మూలించాలని సూచించారు. రాత్రివేళ రోడ్లపై ఆకతాయిలను, అనవసరంగా తిరిగే వారిని అదుపు చేయాలన్నారు.