Mobile Phone | నేటి ఆధునిక జీవితంలో మనుషులకు సెల్ఫోన్తో వీడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటి పెట్టుకొని ఉండాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కనిపిస్తున్నది. అయితే.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత అనేక అనర్థ్ధాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం, నేరమని తెలిసినా కొందరు మానడం లేదు. సెల్ ఫోన్ వాడుతూ ముందూ వెనుకా గమనించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ రద్దీలోనూ సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారే కాకుండా ఎదుటి వారిని ప్రమాదంలోకి నెట్టి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నారు.
సెల్ఫోన్ అధిక వినియోగం యువత పాలిట శాపంగా మారుతున్నది. ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్న ఘటనలు కోకొల్లలు. చెవుల్లో ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ పెట్టుకొని పరధ్యానంగా డ్రైవ్ చేసేవారు చుట్టుపక్కల శబ్దాలు వినిపించక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇయర్ ఫోన్స్ వాడేవారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువగా సంగీతం వింటూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా వాహనాలు నడపడంతో అమాయక ప్రజలు బలవుతున్నారు.
సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టం 184(ఏ) ప్రకారం మొబైల్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ వాహనాలు నడిపితే రూ.500 జరిమానా విధిస్తారు. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానా వేస్తారు. మూడోసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉన్నది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందులో యువతే అధిక శాతం ఉంటున్నారు. అటువంటి వారు ఒకసారి తమ కుటుంబాల గురించి ఆలోచించుకోవాలి.
– పరమేశ్, నేరేడుచర్ల ఎస్ఐ