నల్లగొండ, ఏప్రిల్ 9 : యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ అరకొరగా సాగుతున్నది. దాదాపు అన్ని చోట్లా కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. ఈ నెల 1న కేంద్రాలు అధికారికంగా మొదలైనా చాలాచోట్ల ఆలస్యంగా అందుబాటులోకి వచ్చా యి. ధాన్యాన్ని కల్లాల్లో పోసి రైతులు ఎదురు చూస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనాకు ఇప్పటి వరకు 36,596 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. గన్నీ బ్యాగుల కొరత కూడా అక్కడక్కడ ఉత్పన్నమవుతున్నది. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడే జరిగేలా చూస్తున్నామని నల్లగొండ సివిల్ సైప్లె డీఎం నాగేశ్వర్రావు తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు అరకొరగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం వర్ష సూచన నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం క్వింటా ధాన్యానికి సాధారణ రకం అయితే రూ.2183, గ్రేడ్-1కు రూ.2,203గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఎన్నికల హామీల్లో క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినందున ఈ సారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సాగర్ నియోజకవర్గంలో 15 కేంద్రాలే..
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 15 మాత్రమే ప్రారంభమయ్యాయి.
రెడ్డి కాలనీలో ప్రారంభం కాని కొనుగోళ్లు
నల్లగొండ మండలంలోని రెడ్డి కాలనీ గ్రామంలో ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. 100కు పైగా ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే చందనపల్లికి చెందిన కొందరు రైతులు జైకిసాన్ సొసైటీగా ఏర్పాటై రెడ్డి కాలనీలో ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇతర గ్రామానికి చెందిన మీరెలా కొనుగోలు చేస్తారని, తామే సొసైటీగా ఏర్పడి కొనుగోళ్లు చేస్తామని రెడ్డి కాలనీ వాసులు అంటున్నారు. ఇలా రెండు సొసైటీల గొడవతో సెంటర్లో ధాన్యం కొనుగోళ్లు జరుగడం లేదు. ఈ సెంటర్లో సుమారు 25 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉన్నది. వర్షం, గాలి దుమారంతో ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది. దాంతో సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. వడ్ల కుప్పలతో కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే నిండి పోయాయి. వడ్లు పోసిన రైతులు ఎప్పుడు కొంటరా అని ఎదురు చూస్తున్నరు. పీఏసీఎస్ వాళ్లు పేరుకే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిండ్రు. అసలు కొనడం లేదు. నేను కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి వారం రోజులు దాటింది. అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
– శ్రీరాముల నాగరాజు, రైతు, పాచిల్ల గ్రామం, గుండాల మండలం
15 రోజుల నుంచి ఎదురు చూస్తున్నం
మేము గుండాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 15 రోజులు దాటింది. నేటికీ అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తలేరు. పీఏసీఎస్ వారు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వదిలేసిండ్రు. రోజూ వడ్లను ఎండపోయడం, కుప్ప చేయడం ఇదే పని అవుతుంది కానీ కొనుగోలు చేస్తలేరు. ఎంతో కష్టపడి వడ్లను పండించిన రైతుకు ధాన్యం అమ్ముకోవడం మరింత కష్టమైతాంది. అకాల వర్షాలు వస్తే రైతుల పరిస్థితి ఆగమే. అధికారులు ధాన్యం కొనుగోళ్లను వెంటనే పారంభించాలి.
-బండి విజయ, మహిళా రైతు, గుండాల, యాదాద్రి భువనగిరి జిల్లా