నీలగిరి, ఫిబ్రవరి 3 ;ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటి వరకు మొత్తంగా 2,17,369మందికి పరీక్షలు చేయగా 58,206మందికి కండ్లద్దాలు అందించారు. 27,893మందికి కండ్లద్దాల కోసం ఆర్డర్ పెట్టారు.
నల్లగొండ జిల్లాలో..
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ జనవరి జనవరి 18న లాంఛనంగా ప్రారంభించగా నల్లగొండ జిల్లాలో 19న ప్రారంభమైంది. కార్యక్రమం ప్రారంభమై 16రోజులు కాగా జిల్లాలో 12రోజులు పరీక్షలు చేశారు. 12రోజుల్లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,04,160మందికి పరీక్షలు చేశారు. కంటి పరీక్షలు నిర్వహించేందుకు గాను గ్రామీణ ప్రాంతాలకు 61, పట్టణా ప్రాంతాలకు 14 బృందాలు కలిపి మొత్తం 75 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లు ఇప్పటి వరకు 70గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేయగా మరో 61 గ్రామాల్లో కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 14 టీమ్లను ఏర్పాటు చేయగా 20వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేసి మరో 14వార్డుల్లో కొనసాగుతున్నాయి. రెండు నెలల పాటు గ్రామాల్లో కంటి పరీక్షలు కొనసాగనున్నాయి.
29,485మందికి కండ్లద్దాలు..
జిల్లాలో 1,04,160మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 29,485 మందికి కళ్లద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 17924 మందికి దగ్గర, 11561 మందికి దూరం చూపుల్లో సమస్యలు ఉన్న వారికి వెంటనే కండ్లద్దాలు అందించగా రెండు కండ్లలో సమస్యలు వేర్వేరుగా ఉంటే ప్రత్యేకంగా హైదరాబాద్లో తయారు చేయించి ఇవ్వనున్నారు. ఇందుకుగాను ఇప్పటివరకు11,561మందిని గుర్తించారు. రెడిమెడ్గా అద్దాలు లేకపోవడంతో ఆర్డర్స్ ఇచ్చి చేయాల్సి ఉంది. వీరికి పరీక్షలు చేసిన మూడు వారాల తర్వాలు అద్దాలు అందించనున్నారు.
74,686 మందికి ఇతర సమస్యలు
జిల్లాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఇప్పటి వరకు 11,871మందికి శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 100మందికి ప్రమాదకరంగా కంటి జబ్బు ఉన్నట్లు గుర్తించారు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు వైద్యసిబ్బంది 68,745మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 18,342మందికి రీడింగ్ గ్లాసులు అందించగా మరో 9044మంది కండ్లద్దాలకు ఆర్డరు పెట్టారు. 8,430మందికి శస్త్రచికిత్సలకు రిఫర్ చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు 44,464మందికి కంటి పరీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా 10,379మందికి రీడింగ్ గ్లాసులు అందించారు. 7288మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చామని వైద్యాధికారులు తెలిపారు. శుక్రవారం జిల్లాలో 3,717మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 590మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేసి 469మందికి ప్రిస్క్రిప్షన్ కండ్లద్దాలకు ఆర్డర్ చేశారు.
కంటి వెలుగుతో పేదలకు మేలు
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం పేదలకెంతో ఉపయోగపడుతున్నది. పేదలందరికీ కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం బాగుంది. మా కాలనీలో నిర్వహిస్తున్న క్యాంపులో నేను కంటి పరీక్షలు చేయించుకున్నా. పరీక్షలు చేశాక ఉచితంగా అద్దాలతో పాటు మందులు అందించారు.
–జి.అరుణ, తిరుమలనగర్, నల్లగొండ
ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు
ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తాం. ముందుగా జిల్లావ్యాప్తంగా 74 టీంలను ఏర్పాటు చేసి అదనంగా మరో టీమ్ను ఏర్పాటు చేశాం. క్యాంపు వద్ద అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రతిరోజూ విజయవంతంగా పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.
– అన్నిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ