చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపంలోని నక్కలగండి ప్రాజెక్టులో నలుగురు స్నేహితులు కలిసి స్నానానికి వెళ్లారు.ఈక్రమంలో అచ్చంపేట పట్టి గ్రామ పరిధిలోని సంధ్య తండాకు చెందిన కేతావత్ రాము – లక్ష్మి దంపతులకు చెందిన కేతావత్ శివ (18) స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు.
సోమవారం అచ్చంపేట మండలం ఘనపురంలో తీజ్ వేడుకలు ఉన్నందున అక్కడి బంధువుల ఇంటికి వచ్చాడు. దీంతో మంగళవారం అదే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రాజెక్టు వద్ద డిండి వాగులో ప్రవహిస్తున్న నీటిలో స్నానానికి వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కాలు జారీ లోతుగా ఉన్న నీటిలో పడి మృతి చెందాడు. ఈ నలుగురి కి ఈత రాకపోవడంతో ఏమి చేయలేక సమీపంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. అప్పటికే శివ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. శివ మృతితో తల్లిదండ్రుల రోదనలు పలు వురికి కంటతడి పెట్టించాయి. శివతో వచ్చిన మరో ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.