బొడ్రాయిబజార్,డిసెంబర్ 24: సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో దినదినాభివృద్ధి చెందుతున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను విశాలంగా మార్చారు. పలు ప్రాంతాల్లో కూడళ్లను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రెండు కూడళ్ల పనులు పూర్తి కాగా.. మరో నాలుగింటి పనులు కొనసాగుతున్నాయి. వీటితో పట్టణం కొత్త శోభను సంతరించుకున్నది.
ప్రధాన రహదారిపై ఆరు కూడళ్లు
పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆరు కూడళ్ల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకున్నారు. పాత జాతీయ రహదారిపై ఉన్న కోర్టు చౌరస్తాను సంతోష్బాబు చౌరస్తాగా నామకరణం చేసి సంతోష్బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ చౌరస్తాలో ఫౌంటెయిన్తోపాటు రంగురంగుల దీపపు కాంతులు కనువిందు చేస్తున్నాయి. వాహనదారులు, చిన్నారులు అక్కడ సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పొట్టిశ్రీరాములు సెంటర్లో ఏర్పాటు చేయనున్న చౌరస్తా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, రాఘవ ప్లాజా, జనగాం క్రాస్రోడ్, గిరినగర్లోని కూడళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.1.50కోట్లతో ఈ కూడళ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సెంట్రల్ లైటింగ్, చుట్టూ దిమ్మె ఏర్పాటు చేసి మధ్యలో గ్రీనరీ, చుట్టూ మొక్కలు నాటుతూ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతం మొత్తం కాంతులతో రంగులీనేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నారు.
రెండు చౌరస్తాలతో దళిత వాడకు కొత్త శోభ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22, 23వ వార్డుల్లో ఉన్న దళితవాడ (బర్లపెంట బజార్)లో రూ.14.60లక్షలతో రెండు చౌరస్తాలను ఏర్పాటు చేస్తున్నారు. బర్లపెంట చౌరస్తాలో పాత దిమ్మెను తొలగించి కొత్తగా ఫౌంటెయిన్, బతుకమ్మ విగ్రహాన్ని ఆందంగా తీర్చిదిద్దారు. ఈ ఫౌంటెయిన్ రాత్రి సమయంలో రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో వెలుగులు విరజిమ్ముతూ ఆకట్టుకుంటున్నది. రాపోలు గుడి వద్ద ఉన్న ఎడ్ల గోపయ్య చౌరస్తా సెంట్రల్ లైటింగ్తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నది. ఎడ్ల గోపయ్య చౌరస్తాకు బర్లపెంట చౌరస్తాకు మధ్యలో డివైడర్ను ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటించారు. దాంతో రహదారి కొత్త అందాలు సంతరించుకున్నది. ఈ రెండు చౌరస్తాల ఏర్పాటుతో దళితవాడకు కొత్త శోభ వచ్చింది.
అన్ని రంగాల్లో అభివృద్ధి
మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పాత జాతీయ రహదారిని విస్తరించాం. ఈ రహదారి సూర్యాపేట జిల్లా కేంద్రానికే తలమానికం అవుతుంది. ఇప్పటికే కోర్టు చౌరస్తాను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. రాజీవ్నగర్లో రెండు చౌరస్తాలు ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్ని కూడళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్
ప్రణాళిక ప్రకారం అభివృద్ధి
పట్టణంలో పాత జాతీయ రహదారిని ఆధునీకరిస్తున్నాం. ఇప్పటికే కోర్టు చౌరస్తాలో పనులు పూర్తి చేసి సంతోష్బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. రాజీవ్నగర్లో రెండు కూడళ్లను ఏర్పాటు చేశాం. మిగతా కూడళ్ల అభివృద్ధ్దికి ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నాం. ఈ కూడళ్ల నిర్మాణం పూర్తయితే పట్టణ రూపురేఖలు మారిపోతాయి.
– బైరెడ్డి సత్యనారాయణరెడ్డి,మున్సిపల్ కమిషనర్
మా చౌరస్తా ఇలా అయితదనుకోలేదు
గతంలో చిన్న జాతీయ దిమ్మెతో ఉన్న చౌరస్తా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బతుకమ్మ విగ్రహం, ఫౌంటెయిన్ ఏర్పాటుతో పాటు డివైడర్ను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతుండడం ఆనందంగా ఉంది. రాత్రి పూట రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు జిగేల్మంటున్నాయి. వచ్చిపోయే వారు అక్కడ ఆగి సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. మా చౌరస్తా ఇలా మారుతదనుకోలేదు. సంతోషంగా ఉంది.
– వెంకటరమణ, రాజీవ్నగర్, సూర్యాపేట పట్టణం