– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ, జనవరి 29 : సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం సీఎం రేవంత్రెడ్డి చిల్లర, చౌకబారు, రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులపై గురువారం ఆయన స్పందిస్తూ.. తెలంగాణ జాతి పిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అన్నారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.
పరిపాలనలో చేతకానితనంతో, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం హేయనీయమన్నారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు. చరిత్రను సృష్టించిన వాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందన్నారు. రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు.